Monday, April 29, 2024

కాళేశ్వరం గొప్పతనాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్: పోచారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందని, కానీ ప్రాజెక్టు గొప్పతనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని బాన్సువాడ ఎంఎల్‌ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా, రాష్ట్రంలో కరువును పారద్రోలేలా కెసిఆర్ నిర్మించారని చెప్పారు. ఆరు వందల మీటర్ల లోతు నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టని చెప్పారు. బిఆర్‌ఎస్ చలో మేడిగడ్డ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు రావడం సహజమని చెప్పారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్ భూతద్దంలో చూపిస్తున్నదని విమర్శించారు.

పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు చేయాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ దగ్గర ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. 86 పిల్లర్లకు 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని సరిచేయాలన్నారు. సాంకేతిక సమస్యను రాజకీయ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘కాళేశ్వరంలో మొత్తం196 స్కీం ఉన్నాయి. మూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్న తాము ఎన్నడు బద్నాం చేయలేదు. కడెం ప్రాజెక్టు రెండుసార్లు తెగింది. మెడిగడ్డ కేవలం కుంగింది తెగలేదు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టకండి. రైతు ప్రయోజనాలకు అడ్డు పడొద్దని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే వర్షాకాలం నాటికి సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లో నీటిని నింపాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెడితే మీకే నష్టం. గతంలో 40 ఏండ్లయినా ఒక్కో దగ్గర ప్రాజెక్టులు పూర్తికాలేదు. కానీ తాము కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేశాం. రైతుబంధు అతీగతీ లేదు. ఇప్పటికి మూడు సార్లు పెండింగ్‌లో పెట్టారు. తాము రైతుబంధు సకాలంలో అందించాం కాబట్టే ఐదు రెట్లు ఎక్కువగా పండాయి’ అని పోచారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News