Monday, June 23, 2025

పాత ఫీజులతోనే కౌన్సిలింగ్

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్
ప్రారంభం ఇంకా ఖరారు కాని కొత్త ఫీజులు ప్రభుత్వ
నిర్ణయం మేరకు కొత్త ఫీజులు చెల్లించాలనే షరతుపై
అడ్మిషన్లు రెండు, మూడు రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్
విడుదల ఆగస్టు 14 లోపు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి
చేసేలా చర్యలు కౌన్సిలింగ్ సందేహాల నివృత్తికి
హెల్ప్‌లైన్ నెంబర్ల ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జులై మొదటి వారంలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్ తరగతులు నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) సర్యులర్ జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా నిర్ధేశిత గడువు లోపే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పటివరకు ఇంజనీరింగ్ ఫీ జులపై ఎలాంటి నిర్ణయం వెలువడని నేపథ్యంలో ప్రస్తుతానికి పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-2026) ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తివిద్యా కాలేజీలకు ఈసారిఫీజులు సవరించాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులకు మూడేళ్ల క్రి తం అమలు చేసిన ఫీజుల కాలపరిమితి 202425తో ముగిసింది. ఈ నేపథ్యంలో 2025-26 నుంచి 202728 వరకు అమలు కానున్న

వృత్తి విద్యా కోర్సుల ఫీజులపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) గత మార్చిలో విచారణ ప్రారంభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ ప్రవేశాలు చేపట్టాలంటే వచ్చే మూడేళ్ల (2025-26, 2026-27, 202728) కోసం కొత్త ఫీజులను ఖరారు చేయడం తప్పనిసరి. అయితే కళాశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకుల వేతనాలు, ఇతర అంశాలతో పాటు 2016లో టాస్క్‌ఫోర్స్ బృందాల నివేదికలతోపాటు పలు ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ అధ్యయనానికి మరింత సమయం అవసరమని భావిస్తున్న విద్యాశాఖ పాత ఫీజులతోనే వచ్చే నెల లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను పాత ఫీజులతో ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ, ఫీజుల విషయంలో మాత్రం ప్రభుత్వం తుది నిర్ణయం మేరకు చెల్లించాలనే షరతు విధించనున్నారు.

ఒకవేళ ఈసారికి ఫీజుల పెంపు వాయిదా పడితే మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందే విద్యార్థులు వారి కోర్సు పూర్తయ్యే వరకు.. నాలుగేళ్లపాటు పాత ఫీజులే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజులు సవరిస్తే మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి కొత్త ఫీజులు నిర్ణయించినా స్వల్పంగానే ఫీజులు పెరగవచ్చని భావిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత పెరగకపోయినా ప్రతి మూడేళ్లకు కొన్ని కళాశాలలకు భారీగా ఫీజులు పెరుగుతున్నాయి. కళాశాలలు సమర్పించే ఆదాయ, వ్యయాల ఆడిట్ నివేదికల్లో ఉన్న నిజమెంతో పరిశీలించే అధికారం తమకు లేదని చెబుతూ టిఎఎఫ్‌ఆర్‌సి అధికారులు ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని భావించి అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఇటీవల సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకు సమయం పడుతుందని తాజాగా జరిగిన టిఎఎఫ్‌ఆర్‌సి సమావేశంలో పాత ఫీజులతో కౌన్సెలింగ్‌కు నిర్ణయించారు. జులై తొలి వారంలో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి తొలి విడత సీట్లు కేటాయిస్తే.. చివరి విడతను జోసా తదనంతరం జరిగే సీశాట్ కౌన్సెలింగ్ తర్వాత చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అన్ని బ్రాంచీలను కాపాడుకునేలా చర్యలు
రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్, ఇతర కాలేజీల్లో సీట్ల పెంపు, కోర్సుల విలీనం లేకుండా గత విద్యాసంవత్సరం సీట్లే ఈసారి ఉండనున్నాయి. ఇంజినీరింగ్‌లో ఇప్పటికే 1.10 లక్షల సీట్లు అందుబాటులో ఉండటం, కొన్నేళ్లుగా 100 శాతం భర్తీ కాకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కొత్త సీట్లు అవసరం లేదని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఈసారి అనుబంధ గుర్తింపు కోసం జెఎన్‌టియుహెచ్‌కు ఈసారి 136 ఇంజనీరింగ్ కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, అందులో సీట్ల పెంపు, బ్రాంచీల విలీనానికి అనుమతి ఇవ్వలేదు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ఎప్‌సెట్‌తో పాటు జెఇఇలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు ఈ పరీక్షలకు హాజరైన వారిలో 70 శాతం మందికిపైగా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఐటి, వాటి అనుబంధ కోర్సుల్లోనే చేరుతున్నారు. దాంతో కోర్ బ్రాంచీలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర బ్రాంచీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కోర్ బ్రాంచీలను కాపాడుకోకుంటే భవిష్యత్తులో సమతుల్యత దెబ్బతింటుందని భావిస్తున్న ప్రభుత్వం సీట్ల పెంపునకు, బ్రాంచీల విలీనానికి అనుమతి ఇవ్వలేదు. విద్యార్థుల నుంచి డిమాండ్ ఉందనే కారణంతో అన్నింటినీ సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీలుగా మార్చుకుంటూ పోవడానికి బదులు కోర్ బ్రాంచీల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మిళితం చేయాలని, దానివల్ల ఆ బ్రాంచీల వారికీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

కౌన్సెలింగ్‌పై సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నెంబర్లు
రాష్ట్రంలో ఎప్‌సెట్, ఇసెట్, ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి కోర్సుల ఎంపికపై అవసరమైన సమాచారం అందించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యం కోసం ఉన్నత విద్యామండలి హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7660009768, 7660009769 నెంబర్లను ఫోన్ చేయాలని చేయాలని ఉన్నత విద్యామండలి సూచించింది. అలాగే tgcets.telangana@gmail.comకు ఈమెయిల్ ద్వారా విద్యార్థులు సమాచారం తెలుసుకోవచ్చని తెలిలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News