Wednesday, April 24, 2024

రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి: దాసోజు శ్రవణ్

- Advertisement -
- Advertisement -

రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి
ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలి
బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: 300 మందికి పైగా ప్రాణాలను బలిగొని, వెయ్యి మంది గాయపడటానికి కారణమైన బాలాసోర్ విషాద రైలు ప్రమదానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధ్యత వహించాలని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రధాని మోడీ నిర్లక్ష్యం భారతీయ రైల్వేలను దెబ్బతీసిందని డాక్టర్ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాసోర్ రైలు ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేస్తూ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. మూడు రైళ్లు ఢీకొన్న బాలాసోర్ రైలు ప్రమాదం భారతీయ రైల్వేలో ప్రయాణీకుల భద్రత పట్ల వున్న తీవ్ర నిర్లక్ష్యాన్ని, లోపాలను తెలియజేస్తుందని పేర్కొన్నారు.

పబ్లిసిటీ కోసం వందేభారత్ రైళ్లను ప్రారంభించడంలో నరేంద్ర మోడీకి వున్న ఆసక్తి, రైలు ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇవ్వడంలో లేదని మండిపడ్డారు. రైళ్లు ఢీకొనకుండా నివారించే వ్యవస్థను 2011-12లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ హయాంలో భారతీయ రైల్వే అభివృద్ధి చేసిందని, కానీ ప్రధాని మోదీ ప్రభుత్వం దానిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గుండెను పిండేస్తున్న రైలు ప్రమాదంపై డాక్టర్ శ్రవణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కుట్రపూరితంగా భారతీయ రైల్వేలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. రైల్వేల ప్రాముఖ్యతను దిగజార్చుతూ.. ప్రధాని మోదీ రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారని పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడానికి కూడా దూకుడుగా అడుగులు వేస్తున్నారని, అత్యంత బలమైన ప్రజల రవాణా వ్యవస్థని ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తున్నారని అన్నారు.

‘యాంటీ-కొల్లిషన్ సిస్టమ్ (రైళ్లు ఢీకొనకుండా నివారించే వ్యవస్థ) ఉంటే, ఘోర ప్రమాదం తప్పేదని చెప్పారు. 300 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న, వెయ్యి మంది గాయపడిన బాలాసోర్ రైలు ప్రమాదం ప్రధాని మోడీ ప్రభుత్వ నిష్క్రియ, ఉదాసీనతకు ప్రత్యక్ష ఫలితమని ఫైర్ అయ్యారు. రైళ్లు ఢీకొనకుండా నివారించే వ్యవస్థని యుపిఎ ప్రభుత్వం అభివృద్ధి చేయగా, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దానిని కవచ్‌గా మార్చిందని చెప్పారు. రైల్వే మంత్రి కవచ్ గురించి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. భారతీయ రైల్వేలు మొత్తం రూట్ పొడవు 68,043 కి.మీ.లు ఉండగా, కవచ్ కేవలం 1,445 కి.మీ రైలు పట్టాలపై మాత్రమే ఏర్పాటు చేశారని డాక్టర్ దాసోజు బయటపెట్టారు. రైలు భద్రతా వ్యవస్థల్లో స్పష్టమైన లోపాన్ని ఎత్తిచూపుతూ డాక్టర్ దాసోజు శ్రవణ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:  పంట నష్టాల కింద రూ.14వేల కోట్లు ఇవ్వాలి: షర్మిల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News