ఢిల్లీ లోని పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ వీరికి సమన్లు జారీ చేసింది. ఈనెల 6న సత్యేందర్, 9న సిసోడియా ఢిల్లీ లోని బ్యూరో కార్యాలయానికి రావాలని అందులో పేర్కొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. ఆప్ ప్రభుత్వహయాంలో సిసోడియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ (పీడబ్లుడీ ) మంత్రిగా ఉన్నారు. వారి నేతృత్వంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణంలో రూ. 2 వేల కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. 34 మందికి దీని కాంట్రాక్టులు దక్కగా, వారిలో చాలా మందికి ఆప్తో దగ్గర సంబందాలు ఉన్నట్టు తేలింది.
నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి కాకపోగా, భారీగా ఖర్చు చేశారు. తరగతి గదులను 30 సంవత్సరాలు ఉండేలా కడితే , వాటికి అయిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్ లను నియమించుకోవడంతో వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగిపోయింది. ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇచ్చిన నివేదికలో తరగతి గదుల నిర్మాణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పేర్కొంది. కొత్త టెండర్లు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 326 కోట్లు పెరిగిందని రిపోర్టులో తెలిపింది. సిసోడియా, జైన్లను విచారించేందుకు మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఏప్రిల్లో వీరిపై కేసు నమోదైంది.