హైదరాబాద్: గూగుల్ ఆవిర్భావం నుంచి ప్రపంచం మారిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు మన జీవితం అంతా డిజిటల్తో ముడిపడిపోయిందని, డిజిటల్ సేఫ్టీ అనేది ఎంతో ముఖ్యమైన అంశమని వివరించారు. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మన ఎకానమీ, గవర్నమెంట్ అన్ని డిజిటల్ అయ్యాయన్నారు. గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ ఫస్ట్ ఛాయిస్ గా మారిందని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్గా మారుతుందని జోస్యం చెప్పారు. దేశ జిడిపికి తెలంగాణ 5 శాతం వాటా అందిస్తోందని, మహిళలను కోటీశ్వరులను చేసే పథకాలను చేపట్టామని, మహిళా సాధికారతకు గూగుల్ సహకారం ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
జిఎస్ఇసి హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని స్పష్టం చేశారు. గూగుల్ అనేది ఇన్నోవేటివ్ కంపెనీ అని, మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం అని, నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని రేవంత్ వివరించారు. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతోందని, తెలంగాణ రైజింగ్లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారని కొనియాడారు. తమ ప్రభుత్వంలో నూతన ఆవిష్కరణలు, విధానాలు తీసుకొచ్చామని రేవంత్ స్పష్టం చేశారు.