మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎమ్) పార్టీ అధినేత , ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువసభ స్థానం కేటాయించారు. ఈ విషయాన్ని డీఎంకేఎంఎన్ఎం ఖరారు చేశాయి. ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడుకు చెందిన అన్బుమణి రామదాస్, ఎం.షణ్ముగమ్, ఎన్. చంద్రశేగరన్, ఎం.మహమ్మద్ అబ్దుల్లా, పి. విల్సన్, వైగో ఎగువసభ పదవీ కాలం జులై 25తో ముగిసింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకేకు 134 మంది ఎమ్ఎల్ఎలు ఉన్నారు.
దాంతో నాలుగు స్థానాలనూ ఆ పార్టీనే దక్కించుకుంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విపక్ష ఇండియా కూటమిలో ఎంఎన్ఎం భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే , కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రాష్ట్రం లోని 39 లోక్సభ స్థానాలు , పుదుచ్చేరి లోని ఒక స్థానంలో ఎంఎన్ఎం ప్రచారం చేసింది. 2025 ఎగువ సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వం లోని కూటమి అంగీకరించింది. ఆయన 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు గ్రామాల సాధికారత కోసం దీనిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
అన్నా డిఎంకే బలం అంతంతే… బీజేపీ మద్దతు కీలకం
అన్నాడీఎంకేకు ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలంతో ఒక్క రాజ్యసభ ఎంపీ గెలుస్తుంది. ఒకవేళ మరో అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని భావిస్తే అది బీజేపీ, పీఎంకే ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ ప్రస్తుతం అన్నాడిఎంకే పక్షానే ఉంది. తప్పకుండా ఇరు పార్టీలు సహకరించుకునే అవకాశం ఉంది.