Sunday, May 5, 2024

సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠా పట్టివేత: ఎస్ పి గుమ్మి చక్రవర్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్ పి గుమ్మి చక్రవర్తి తెలిపారు. సూరారం పోలీసులతో పాటు టిఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించగా, డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు 50 లక్షల రూపాయల విలువ ఉంటుందని చెప్పారు. డ్రగ్స్ తయారీలో ప్రధాన నిందితుడు కమ్మ శ్రీనివాస్ గా గుర్తించామని, కమ్మ శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో ఉంటున్నారని చెప్పారు. మణికంఠ అనే వ్యక్తి కాకినాడ ప్రాంతానికి చెందిన వాడు అని, ఇతనికి చేపల చెరువులు ఉన్నాయని, నరసింహ రాజు సూపర్ వైజర్ కం డ్రైవర్ గా పని చేస్తున్నారని గుమ్మి చక్రవర్తి చెప్పారు.

కమ్మ శ్రీనివాస్ 2013 లో ఓ పరిశ్రమలో ఇదే డ్రగ్స్ తయారీ చేశాడని, ఆ సమయంలో ఎన్ సిబి వాళ్ళు పట్టుకుని జైలుకు పంపారని, నాలుగు సంవత్సరాలు తరువాత బయటికి వచ్చాడని, జైలు నుండి బయటికి వచ్చాక నరసింహ రాజు మణికంఠతో కలిపి డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారనొ, సూరారంలో ఒక ఇంట్లో మెథాంఫెటమైన్ డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారని గుర్తు చేశారు. నిందితుడు కమ్మ శ్రీనివాస్‌కు డ్రగ్స్ తయారీపై అవగాహన ఉందని వివరించారు. ఈ ముగ్గురు సంయుక్తంగా గత రెండు సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని గుమ్మి చక్రవర్తి తెలిపారు. లిక్విడ్ మెథాంఫెటమైన్ ప్రాసెస్ చేసి డ్రై చేస్తే క్రిస్టల్ మెథాంఫెటమైన్ డ్రగ్ తయారవుతుందని, తయారు చేసిన డ్రగ్స్ వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తారని, సోషల్ మీడియా ద్వారా విక్రయాలు కొనసాగిస్తారని గుమ్మి చక్రవర్తి చెప్పారు. మెథాంఫెటమైన్ డ్రగ్ అనేది రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్తుందని, అందుకే దానిని వినియోగిస్తారని, ముగ్గురు నిందితుల పై పిడియాక్ట్ నమోదు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News