Thursday, April 25, 2024

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కు మరోసారి ఇడి నోటీసులు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కు ఇడి మరోసారి నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. థాయ్‌లాండ్ లో చీకోటీ ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ పట్టుబడడంతో ఇడి అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 15న విచారణకు రావాలని ఆ నోటీసులో ప్రవీణ్ కుమార్‌ను ఇడి అధికారులు కోరారు. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘిం చారని ఇడి కేసు నమోదు చేసింది. చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా నోటీసులు పంపింది. ఇందులో సంపత్ ఇప్పటికే విచారణకు హాజరు కాగా, మరో ముగ్గురు ఇడి ఎదుట హాజరుకావాల్సి ఉంది. పట్టాయ కోర్టులో చీకోటి ప్రవీణ్ తో పాటు ఇతరులకు బెయిల్ వచ్చినప్పటికీ కొంత మంది ఇంకా ఇండియాకు చేరుకోలేదు.

థాయ్‌లాండ్ నుంచి మే12న చికోటి ప్రవీణ్ హైదరాబాద్ కు వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ అక్కడి పోలీసులకు చీకోటి ప్రవీణ్ అడ్డంగా దొరికిపోయాడు. నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెబితే తాను థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లుగా తెలిపాడు. దేవ్ , సీత అనే ఇద్దరు తనకు ఆహ్వానం పంపారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెబితేనే తాను వెళ్ళినట్టిగా తెలిపాడు. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ నిషేధం అనేది తనకు తెలియదని చెప్పాడు. తాను హాల్ లోకి వెళ్లిన 10 నిమిషాలకే దాడి జరిగిందన్నాడు. ఈ గ్యాంబ్లింగ్‌తో సంబంధం లేదని తేలడంతో తాను చట్ట పరంగా బయటకు వచ్చానన్నాడు. చీకోటి ప్రవీణ్‌కు థాయ్‌లాండ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు ఆరెస్ట్ అయిన83 మంది భారతీయులకు కూడా థాయ్‌లాండ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 4500 బాట్స్ జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది. జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్ పోర్టులు కూడా ఇచ్చేశారు.

గతంలో కూడా ఇడి విచారణ…
గతంలో కూడా చీకోటి ప్రవీణ్ ను ఇడి విచారించింది. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో, ఈవెంట్స్ లావాదేవీలు, పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం దారి మళ్లించడం, బ్యాంకు ఖాతాల వివరాలు, వంటి అంశాలపై ప్రవీణ్ బృందాన్ని ఇడి అధికారులు విచారించారు. చీకోటి కస్టమర్లలో మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, జడ్‌పి ఛైర్మన్లు ఇలా చాలా మంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, థాయ్ లాండ్ తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్ బృందం తరలించినట్లు ఇడి గుర్తించింది.

పట్టాయ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపుగా రూ. వంద కోట్ల వరకూ గ్యాంబ్లింగ్ నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడించిందనేది ఆ కేసులో ఇడి ప్రధాన అభియోగం. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకొని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఇడి అనుమానిస్తోంది. ఈ సారి మొత్తం గుట్టు ఇడి బట్టబయల్జేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News