Friday, June 13, 2025

బడిబాటలో ముళ్ళు, రాళ్లు

- Advertisement -
- Advertisement -

పేదవాళ్లకైనా, పెద్దవాళ్లకైనా ఒకే చదువు, ఒకే బడి అది కామన్ స్కూల్ విధానంలో అందరికీ సమానంగా అందించబడాలన్న రాజ్యాంగ స్ఫూర్తి పాలకుల విధానాల వల్ల నీరుగారిపోయింది. పర్యవసానంగా డబ్బులు ఉన్నవాళ్లకి కార్పొరేట్ విద్య, ఏ ఆధారం లేని పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ప్రభుత్వ విద్య. రెండు రకాల, రెండు గ్లాసుల విధానం లాగా రెండు ‘క్లాస్’ల విధానం కొనసాగుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు విద్య, వైద్య రంగాల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సకల జనుల స్వప్నం నెరవేరుద్ది అనుకున్నాం. విద్యారంగం ఆంధ్ర వలసాధిపత్యం కార్పొరేటీకరణ కబంధహస్తాల నుండి బయటపడి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పలుమార్లు అన్నట్లు తెలంగాణలో విద్య అందరికీ, సమానంగా అందించబడు తుంది అన్న కల నెరవేరకపోగా, దశాబ్ది తెలంగాణ పాలన అనంతరం తెలంగాణ విద్యారంగం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కన్నా వెనుక ఉండటం అత్యంత విచారకరమైన సందర్భం.

నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షిస్తూ, దాన్ని మూలాలను మార్చే ఒక ప్రయత్నంలో భాగంగా ఒక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ, ఆహ్వానించదగ్గ అంశమే. అయితే ఆ విద్యా కమిషన్ (Education Commission) సూచించినట్టుగా మండలానికి మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ దశలవారీగా ఏర్పాటు చేయడానికి సూచించిన బడ్జెట్‌ను ఆమోదించకపోవడం విచారకరం. తాము అధికారంలోకి రావడానికి 15% విద్యారంగానికి నిధులు కేటాయిస్తామని చెప్పిన వాగ్దానం సగానికి మించి ఆమోదించబడలేదు. ఇందుకు భిన్నంగా అసలు రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల్లో కొనసాగుతున్న విద్యారంగాన్ని ఒక గొడుగు కిందికి తీసుకురావాల్సిన విధానం పోయి ఇప్పటికీ ఇంకా రెసిడెన్షియల్, మోడల్, ప్రభుత్వ, ప్రైవేటు, కెజిబివి, లోకల్ బాడీ తదితర రూపాల్లో విద్య అందించబడటం అసమానతల్ని పెంపొందిస్తున్నది. కులానికో రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి అన్ని కులాలకు సంబంధించిన గ్రామీణ ప్రాంతంలో అందరూ కలిసి చదువుకునే పాఠశాలల వ్యవస్థను క్రమంగా కూలదోస్తూ వస్తున్నారు.

వీటిని సరి చేయవలసిన విద్యారంగా విధానాలు మరొక కొత్త రూపాన్ని యంగ్ ఇండియా ఇనిషియేటివ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్‌ఎస్) పేర నియోజకవర్గానికి ఒక పాఠశాల అది 25 ఎకరాలతో 200 కోట్ల రూపాయలతో నిర్మితం కాబోతున్నది. దీన్ని ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టుగా ఆయా వర్గాలకు దోహదపడుతుందన్న ఒక అంశం ఆహ్వానించదగ్గది అయినా అదే కోవలో ఆయా వర్గాలకు, అందరికీ అలాంటి విద్య అందకుండా కొందరికి మాత్రమే అందించే దిశలో మిగిలిన పాఠశాలలల్ని పట్టించుకొని స్థితి కొనసాగుతుంది. గత ప్రభుత్వం మన ఊరు మన బడి కింద కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి ఫ్యాన్లు, రంగులు వేసి ఇతర అంశాలు వదిలేస్తే, అవి అలాగే నిర్లక్ష్యంలో అది రూ. 200 కోట్లు ఒక నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి పాఠశాలకు రూ. 50 లక్షలు కేటాయించినా ఆ పాఠశాల మౌలిక వసతుల్ని పెంపొందిస్తూ పాఠశాలను ఉన్నతీకరించవచ్చు.

ఇందుకు భిన్నంగా అసలు విద్యార్థుల సంఖ్య పెరగకపోవడానికి కారణాలు అన్వేషిస్తూనే పెంచుకోవడానికి ఒక అవకాశం ఇవ్వవలసిన సందర్భంలో ముందే వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కోసం ఉపాధ్యాయులను తరలిస్తూ పాఠశాలలను మూసివేసే నిర్ణయం అయితే ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు జులై 15 వరకు పొడిగించడం ఒక ఆహ్వానించదగ్గ. అయితే ఈ వెసులుబాటును నిజంగానే మొన్నటిదాకా పొందిన శిక్షణాల ప్రేరణతోపాటు బడిబాటలో చూపిస్తున్న చొరవతో విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ పాఠశాలలను నిలబెట్టే ఒక ప్రయత్నం ఉపాధ్యాయ వర్గం నిర్విరామంగా చేయవలసి అట్లా నిలదొక్క లేకపోతే మూసివేత తప్ప గురవుతున్న పాఠశాలల్ని స్థానిక ప్రజల సహకారం ప్రమాణాల పెంపుదలతో ప్రయత్నించకపోతే అనివార్యంగా ప్రభుత్వం కోరుకుంటున్నా మూసివేత కొనసాగే ప్రమాదం ఉంది.

ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం జరిగే తంతులాగే విద్యా రంగం పాఠశాల ప్రారంభోత్సవానికి ముందు బడిబాట పేరిట జయశంకర్ సార్ స్ఫూర్తితో ఓ ప్రచారపర్వం ఇప్పుడు ఊరూర ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామసభల పేర కొనసాగుతున్నది. మే నెల మధ్యలో దాదాపు లక్షన్నర ఉపాధ్యాయులకి రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతలుగా ఐదు రోజుల చొప్పున ఆయా సబ్జెక్టులలో నైపుణ్యాలను పెంపొందించడం కోసం శిక్షణా తరగతులు జరిగాయి. ఆ శిక్షణా తరగతుల్లో అదే పనిగా పదేపదే చెప్పిన అంశాలనే మళ్లీమళ్లీ చెప్తున్నా ఆ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు కాస్త ప్రేరణ పొందుతున్నా తీరా బడి దాకా వచ్చాక బడిలో బడిబాటలో కొనసాగుతున్నా ఎందుకు విద్యార్థుల సంఖ్య పెరగటంలేదు. విద్యారంగం ఎదుర్కొంటున్న ఆయా సమస్యల్ని పరిష్కరించుకోకుండా ప్రజలు, ప్రభుత్వం టీచర్ల మీద విసురుతున్న రాళ్లు, ముళ్లను ఏరకుండా ఇవాల్టి ప్రభుత్వ విద్యారంగాన్ని బాగుపరచుకునే స్థితి లేదా ప్రమాణాల్ని పెంచడానికి విద్యార్థుల సంఖ్య తగ్గిపోకుండా ఉండడం సాధ్యం కాదు.

ఇన్ని సమస్యల మధ్య కూడా ప్రభుత్వం ఇవాళ కొత్తగా వచ్చిన విద్య అధికారుల పట్టింపు వల్ల కొత్త వరవడిలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు ప్రమాణాలను పెంచడానికి బడిబాట ఒక రకంగా ప్రభుత్వ టీచర్లు సవాలుగా స్వీకరించవలసి ఉన్నది. అన్ని వసతుల తరగతితో విద్యార్థుల హాజరు, టీచర్లు హాజరు సరిగ్గా ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా ఎందుకు విద్యా ప్రమాణాలు పెరుగుతలేదు? అందుకు కారకులు ఎవరో సమీక్షించుకోవాల్సి ఉంది. అలాగే ఆయా స్థితిగతుల్ని బాగు చేయడానికి ప్రభుత్వం ఆయా పాఠశాలలను ఉన్నతీకరించడానికి పర్యవేక్షణతోపాటు భౌతిక వనరుల్ని సామర్థ్యాలను పెంచడానికి నిధులు పెంచవలసి ఉన్నది.

ఏ అర్హతలు లేని, కనీస వేతనం, సెలవులు, ఉద్యోగ భద్రత లేని ప్రైవేటు టీచర్లు ఎంత లేదన్నా కొంతమేర కనీస సామర్ధ్యాలు సాధిస్తున్నప్పుడు, అవన్నీ ఉండి బడికి వచ్చే పిల్లలు కనీసం చదవడం, రాయడం లక్షల్లో జీతాలు పొందుతున్న టీచర్లు, ఆ జీతాలు ఆ పిల్లల తల్లిదండ్రుల రక్తమాంసాల చమట బిందువులేనని గుర్తించి బాధ్యతాయుతంగా పని చేయడంవల్ల మాత్రమే ప్రభుత్వపాఠశాలలను కాపాడుకోగలం. ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే ప్రయత్నం అటు ప్రభుత్వం, ఇటు టీచర్లు, విద్యార్థి సంఘాలు, పౌరసమాజం ఒక బాధ్యతగా స్వీకరించకపోతే భవిష్యత్తులో మళ్లీ వెసలుబాటు ఉన్న వర్గాలకు తప్ప బడుగు బలహీన పేద వర్గాల పిల్లలు బడికి దూరం అయిపోయి ఓ అంధకార బంధురమైన విద్యా విలువలు లేని సమాజ నిర్మాణంలో పునాదిరాళ్లను వేసినట్లే.

  • ప్రభాకర్ కస్తూరి, 94409 79454

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News