Thursday, April 25, 2024

సాగు భూములను కాపాడుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు కేవలం నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాకు, మండలాలకు, గ్రామాలకు, పల్లెలకు కూడా వెళ్లడంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు ప్లాట్లుగా మారిపోతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి, ఇతర అభివృద్ధి పనుల కోసం కొంతమేర వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిపోతోంది. దీని ద్వారా వ్యవసాయం నుంచి కాకపోయిన కొంత అభివృద్ధి, జీవనోపాధి లభిస్తుంది. కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి బీడు భూములుగా మారిపోతున్న భూముల వల్ల దేశ వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.

మన దేశము వ్యవసాయక దేశం. జనాభాలో అత్యధిక శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం అనేది మన దేశానికి విడదీయరాని అనుబంధం వుంది. ఇంతేకాక మన దేశంలో జరుపుకునే పండుగలు, పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. నా చిన్నతనంలో మా కొలనూరు చుట్టు ప్రక్కల ప్రాంతం లో నాగళ్ళ లెక్కతో ఒక వ్యక్తికి ఉన్న వ్యవసాయ భూమితో సంఘంలో గౌరవ మర్యాదలు దొరికేవి అంటే వ్యవసాయ భూమికి అంత ప్రాధాన్యత ఉండేది. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో మన దేశం పదో స్థానంలో ఉంది. ఆహార ఉత్పత్తులు అధికంగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఒకటిగా ఉన్నదని చెప్పవచ్చు.

ప్రపంచంలో పప్పు దినుసులు, మసాలాలు, జనపనార, మామడి, అరటిని ఎక్కువగా పండిస్తున్న దేశం మనది. అత్యధికంగా వరి, గోధుము, పండ్లు, కూరగాయలు, పత్తి, చెరకు, నూనె గింజలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది.మన దేశ భూభాగంలో 52 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. సుమారు 60 శాతానికి పైగా దేశ జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. వ్యవసాయానికి ఇంత ప్రాధాన్యత ఉన్న మన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో వ్యవసాయ భూము వ్యవసాయేతర భూములుగా వేగంగా మారుతుండటం ఇటీవలి కాలంలో మన దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉన్నది.

గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో వ్యవసాయ భూము విచ్చలవిడిగా వ్యవసాయేతర భూములుగా మారిపోతున్నాయి. ఇది ఆహార భద్రతకు కూడా ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉన్నది. తెలంగాణలో దాదాపు 20 ఏళ్ల కింది పరిస్థితికి, నేటికి చూసుకుంటే ఎంత త్వరగా వ్యవసాయ భూము వ్యవసాయేతర భూములుగా మారిపోతున్నాయో అర్థమవుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ఊరు నుండి మరొక ఊరికి, ఇతర పట్టణాలకు, నగరాలకు పోతుంటే ఊర్లు దాటగానే రోడ్డుకు ఇరు ప్రక్కల ఆకు పచ్చటి వ్యవసాయ భూములే ఎక్కువగా కనిపించేవి. కానీ, ఇప్పుడు ఈ వ్యవసాయ భూమున్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి బీడు భూము అవుతున్నాయి.

ఒకప్పుడు కేవలం నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాకు, మండలాలకు, గ్రామాలకు, పల్లెలకు కూడా వెళ్లడంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు ప్లాట్లుగా మారిపోతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి, ఇతర అభివృద్ధి పనుల కోసం కొంతమేర వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిపోతోంది. దీని ద్వారా వ్యవసాయం నుంచి కాకపోయిన కొంత అభివృద్ధి, జీవనోపాధి లభిస్తుంది. కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి బీడు భూములుగా మారిపోతున్న భూముల వల్ల దేశ వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.

మన రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, వ్యవసాయేతర భూమిగా 22.23 లక్షల ఎకరాలు మారిపోయింది. గత పదేండ్లలోనే 11.95 లక్ష ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిందంటే ఎంత వేగంగా వ్యవసాయం తగ్గుతూ వస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. గతంలో కేవలం హైదరాబాద్ శివార్లు లేదా జిల్లా కేంద్రాలకే రియల్ ఎస్టేట్ పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ కు అన్ని వైపులా దాదాపు 70 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడ్డాయి. కేవలం హైవేపై మాత్రమే కాకుండా హైవే నుంచి పది కిలోమీటర్ల లోపలి వరకు వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి.

రాష్ట్రంలో ఇప్పుడున్న 33 జిల్లాల కేంద్రాలకు చుట్టుపక్కల, సగానికి పైగా మండల కేంద్రాల చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక ధరలు పెట్టి వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తామని వస్తుండటంతో రైతులు భూములు అమ్మడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, వ్యవసాయంలో నష్టాలు వంటి అనేక కారణాల వల్ల భూములను అమ్మేందుకు రైతు మొగ్గు చూపుతున్నారు. ఈ భూములను కొనుగోలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లుగా మార్చి, ప్లాట్లు చేసి రంగురంగు ఆకర్షణీయమైన ప్రకటనలను పత్రికలలో, టివిలలో విస్తృతమైన ప్రచారం చేసి అమ్ముతున్నారు. అంతేకాకుండా అద్భుతమైన పథకాల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపి స్తూ కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు. పెట్టుబడిగా భావించి ఈ ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

ఈ ప్లాట్లలో ఎక్కువ శాతం నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో వేలాది ఎకరాల భూము లు బీడు భూములుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ సమీప జిల్లాల్లో ఈ పరిస్థితి అత్యధికంగా ఉన్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. వ్యవసాయంపై ఆధారపడి జీవించిన రైతు, రైతు కూలీలు ఉపాధికి దూరమవుతారు. వ్యవసాయ భూమి తగ్గిపోవడం ఆహార భద్రతకు కూడా ముప్పుగా మారుతుంది. రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది.

వ్యవసాయ భూములు తగ్గిపోవడాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వ్యవసాయ భూములు తగ్గిపోకుండా ఉండేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని కఠిన నిబంధనలు తీసుకుంటున్నాయి. విజయవంతంగా అమలు చేస్తున్నారు. కర్ణాటక, హిమాయల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ భూములు కేవలం వ్యవసాయదారుడు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉండేలా చట్టాలు ఉన్నాయి. సాగు భూమి తగ్గిపోకుండా ఈ చట్టం కాపాడుతుంది. కేరళలో పాడీ ఆండ్ వెట్‌ల్యాండ్ కన్సర్వేషన్ యాక్ట్ – 2008 ప్రకారం వ్యవసాయేతర అవసరాల కోసం గరిష్ఠంగా 10 ఎకరాలు భూమిని మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ 10 ఎకరాలు భూమిలోనూ 4 ఎకరాలు మాత్రమే ఏదైనా నిర్మాణం చేపట్టాలి అని నిబంధనలు ఉన్నాయి. ఇటువంటి చట్టాలు మరింత మెరుగ్గా తీసుకు వచ్చి వ్యవసాయ భూములు తగ్గిపోకుండా చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

ఆహార భద్రతకు, పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి ముప్పుగా మారిన ఈ సమస్యకు శాశ్వత, ఖచ్చితమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారడాన్ని నియంత్రించకపోతే భవిష్యత్‌లో తీవ్రమైన నష్టం ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు మరిన్ని నిబంధనలు తీసుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఒక పరిమితిని విధించుకొని ఆ పరిమితిని దాటి వ్యవసాయ భూమి తగ్గకుండా చూడాలి. ఇష్టారాజ్యంగా భూములు లేఅవుట్లుగా మారకుండా అవసరమైనంత వరకే అనుమతులు ఇవ్వాలి.

అక్రమ లే అవుట్లను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. నగరానికి దూరంగా వెలుస్తున్న లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేస్తున్న వారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడం లేదు. కేవలం పెట్టుబడిగా భావించే వాటిని కొనుగోలు చేసి పెడుతున్నారు. ఇవన్నీ నిరుపయోగంగా మారిపోతున్నాయి. కాబట్టి లేఅవుట్ల ఏర్పాటుకు నిబంధనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నివాస యోగ్యత ఉన్న ప్రాంతాల్లోనే లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలి. లే అవుట్ల ఏర్పాటుకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఆ పరిధిలో మాత్రమే లేఅవుట్లు చేసే అవకాశం ఉండాలి. నిరుపయోగంగా ఉండే ప్లాట్లను ప్రజలు పెట్టుబడిగా భావించకుండా చూడాలి.

వ్యవసాయ భూమిని ఇతర అవసరాల కోసం వ్యవసాయ భూమిగా మార్చే సమయంలో నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏ అవసరం కోసం అయితే వ్యవసాయ భూమిని మార్చుకున్నారో ఆ పనిని పూర్తి చేసేందుకు కాల పరిమితి విధించాలి. ఉదాహరణకు ఎవరైనా ఒక పరిశ్రమ ఏర్పాటుకు వ్యవసాయ భూమిని మార్పు చేయించుకుంటే ఆ పరిశ్రమ ఏర్పాటుకు కాలపరిమితిని విధించాలి. కాల పరిమితిని దాటిన పరిశ్రమ స్థాపించకపోతే ఆ భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా మార్చేలా నిబంధనలు ఉండాలి. తద్వారా వ్యవసాయ భూములను రక్షించుకోగలుగుతాము.

దండంరాజు
రాంచందర్ రావు
9849592958

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News