Friday, May 30, 2025

పంటల బీమాతో రైతుకు ధీమా

- Advertisement -
- Advertisement -

సాగుకు సకల కోటి కష్టాలు అన్నట్టు పొలం దున్ని విత్తనం విత్తినప్పటి నుండి కోత కోసి అమ్మేవరకు అన్నదాత అనునిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొవాల్సి వస్తున్నది. అందులో ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడి అనేక సార్లు పంటలు నష్టానికి గురై రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు ప్రతి సంవత్సరం పునరావృతం అవ్వడం వల్ల రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. మన రాష్ట్రంలో గత కొన్ని నెలల వ్యవధిలోనే అకాల వర్షాల కారణంగా లక్షల ఎకరాలలో వరి, మామిడి వంటి చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని రైతులకు తీవ్రమైన ఆర్థిక నష్టానికి కారణమయ్యాయి. భారతదేశంలో 61% రైతాంగం నికర సాగు విస్తీర్ణంలో సుమారుగా 55% వర్షాధార పంటలు పండిస్తున్నారు.

అందువల్ల వర్షాధార వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రతకు కీలకమైనది. ప్రస్తుతం ఇది మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దాదాపు 40% వాటా కలిగి ఉంది. వర్షాధార పంటలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర నష్టం కలుగుతున్నది. ఈ తరుణంలో ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులను రక్షించడం, తదుపరి సీజన్‌కు వారి రుణ అర్హతను నిర్ధారించడం, వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవస్థలో ప్రమాదం, దుర్బలత్వ సమస్యలను ఎదుర్కోవడానికి బహుళ విధానాలను అవలంబించాలి. అందులో పంట బీమా ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ బీమాకు తక్కువ డిమాండ్ ఉన్న అంశం. ఎందుకంటే ప్రీమియంలు ప్రతి సంవత్సరం వసూలు చేయబడతాయి. కానీ నష్టపరిహారాలు చాలా అరుదుగా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మాత్రమే చెల్లించబడతాయి అన్నది సాధారణ రైతు భావన.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కొన్ని దశాబ్దాలకు పూర్వం నుంచి బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. వాటిలో ద్రాక్ష రైతులకు వడగళ్ల బీమా రూపంలో మొదటి పంట బీమా కార్యక్రమం 1820లలో ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలలో ప్రారంభించబడ్డాయి. 1883లో అమెరికాలో పొగాకు పంట కోసం ప్రారంభమైంది. అదే విధంగా, అమెరికాలో మొట్టమొదటి బహుళ -ప్రమాద పంట బీమా (ఎంపిసిఐ) 1939లో ఫెడరల్ క్రాప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటుతో ప్రారంభమైంది. మన దేశంలో ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళు, పంటల పాక్షిక లేదా పూర్తి వైఫల్యానికి దారితీసే వ్యాధులు వంటి వివిధ ప్రమాదాల నుండి వ్యవసాయ సమాజాన్ని బీమా చేయడానికి భారత ప్రభుత్వం గత మూడు దశాబ్దాలుగా అనేక పంట బీమా పథకాలను ప్రవేశపెట్టింది. అందులో 1985లో ప్రారంభించబడిన సమగ్ర పంట బీమా పథకం (సిసిఐఎస్), దేశవ్యాప్తంగా మొట్టమొదటి పథకం. 1999లో సిసిఐఎస్ స్థానంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్‌ఎఐఎస్) ప్రవేశపెట్టారు.

అదే విధంగా, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుండి రైతులకు కలిగే నష్టాలను తగ్గించడం కోసం 2007 నుండి వాతావరణ ఆధారిత పంట భీమా పథకాన్ని (డబ్లుబిసిఐఎస్) ప్రారంభించారు. ఆ తర్వాత సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్‌ఎఐఎస్) తీసుకొచ్చారు. 2013- 14లో ఎంఎన్‌ఎఐఎస్, డబ్లుబిసిఐఎస్‌లను విలీనంచేసి జాతీయ పంట బీమా కార్యక్రమాన్ని (ఎన్‌సిఐపి), ఎన్‌ఎఐఎస్ స్థానంలో ప్రవేశపెట్టి 2015- 16 వరకు కొనసాగించారు. 2016లో, ఎన్‌ఎఐఎస్, ఎన్‌సిఐపిల స్థానంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై), పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో కొనసాగుతున్నది.

భారతదేశ జాతీయ పంటల బీమా పథకం అయిన ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకం, రైతుల దరఖాస్తుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన & పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత బీమా పథకం (ఆర్‌డబ్లుబిసిఐఎస్) 2016 -17 నుండి 2023 -24 వరకు కలిపి దేశం మొత్తం రైతు దరఖాస్తులు 63.19 కోట్లు కాగా, బీమా చేయబడిన ప్రాంతం 42.21 కోట్ల హెక్టార్లలో బీమా మొత్తం రూ. 17,29,395 కోట్లు. రాష్ట్రంలో 2022- 23లో మొత్తం రైతు దరఖాస్తులు 36.36 లక్షలు కాగా, బీమా చేయబడిన ప్రాంతం 37.83 లక్షల హెక్టార్లు, చెల్లించిన బీమా మొత్తం రూ. 25,529.70 కోట్లు. వ్యవసాయ పంటల బీమా పథకాల పనితీరు మీద భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక- 2017 ప్రకారం మన దేశంలో అమలవుతున్న పంట బీమా పథకాల అమలులో అనేక సమస్యలను ఎదురవుతున్నాయి. అందులో ప్రధానంగా పంటల దిగుబడిపై పంట కోత డేటా, పంట బీమా పథకాల మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫైడ్ ప్రాంతాలలోని అన్ని నోటిఫైడ్ పంటలకు పంట దిగుబడిని అంచనా వేయడానికి అవసరమైన సంఖ్యలో పంట కోత ప్రయోగాలను (సిసిఇ) ప్లాన్ చేసి నిర్వహించాలి.

అయితే అవసరమైన దానికంటే తక్కువ పంట కోత ప్రయోగాలను (సిసిఇ) నిర్వచించబడుతున్నాయి. అదే విధంగా, ఒకే భూమిపై బహుళ రుణాలు పొందడం, రైతులు పంటల బీమా ప్రీమియం అధికంగా వున్నాయని భావిస్తున్నారు. క్లెయిమ్ పరిష్కారంలో జాప్యం వంటి అనేక సవాళ్లుగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, పథకం బీమా చేయబడిన ప్రాంతం విత్తిన విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తి, పంట నష్టం, వాతావరణ సమాచారం, పంట ప్రమాద దుర్బలత్వ సూచిక, వాతావరణ ఆధారిత పంట బీమా నమూనాలను అనుసంధానించడం వల్ల అర్హులైన వారందరికీ సరైన సమయంలో పంట బీమాను అందించవచ్చు. అందుకుగాను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనం, రిమోట్ సెన్సింగ్ వంటి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సకాలంలో, పారదర్శకంగా నష్టం అంచనా వేయడంతోపాటు ఆమోదయోగ్యమైన క్లెయిమ్‌లను సకాలంలో పరిష్కారం కోసం వైఇఎస్‌టిఇసిహెచ్ (టెక్నాలజీ ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ) 2023 నుండి ప్రవేశపెట్టబడింది.

జాతీయ పంట బీమా పోర్టల్, బీమా కంపెనీలు పంట దిగుబడి డేటా/ పంట కోత ప్రయోగాలు, రాష్ట్ర భూమి రికార్డులను లాంటి మొదలగు సమాచారాన్ని ఇవ్వవడానికి సిసిఇ -అగ్రియాప్ రూపొందించింది. అదే విధంగా, కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించడం కోసం వాతావరణ సమాచారం, నెట్‌వర్క్ డేటా సిస్టమ్స్ (డబ్లుఐఎన్‌డిఎస్) బ్లాక్ స్థాయిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఎడబ్లుఎస్), పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లు (ఎఆర్‌జిఎస్) ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఉపయోగించే రిమోట్ సెన్సింగ్, డ్రోన్లు, స్మార్ట్ ఫోన్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాలు బీమా చేయబడిన ప్రాంతం, నష్టాల స్థాయి అంచనాలను నిర్వహిస్తున్నప్పటికీ అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.

ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ప్రాంతాలవారీగా సంబంధిత ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలను అంచనా వేయడానికి నూతన సాంకేతిక విధానాలు ఉపయోగించి పంట నష్టాలను ప్రభుత్వ, స్వతంత్ర ఏజెన్సీల ద్వారా కచ్చితంగా అంచనా వేయాలి. అదే విధంగా బీమా చేయబడిన రైతులు, పంట నష్టాల వివరాలను సమగ్ర సమాచారాన్ని నిర్వహించాలి. అంతేకాకుండా బీమా పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట బీమా పథకాల కిందకు పెద్ద సంఖ్యలో రైతులను తీసుకురావాలి. అందుకు ప్రభుత్వాలు తక్కువ ప్రీమియర్లతో పంటల బీమా పథకాలను రైతుల ముందుకు తెచ్చి పంట బీమాలకు సంబంధించిన వివరాలను విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం వల్ల రైతు సోదరులు పంట నష్టాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను పంటల బీమా రూపంలో పొంది ధీమాగా ఉండగలరు

  • డా. రేపల్లె నాగన్న
    79908 42149
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News