Sunday, April 28, 2024

ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం

- Advertisement -
- Advertisement -

దివ్యాంగురాలు రజనికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే జిఒపై రెండో సంతకం

ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే రెడ్డి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అభయ హస్తం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనికి గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్న జిఒపై రెండో సంతకం చేశారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి సిఎంగా ప్రమాణస్వీకారం చేయగానే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే హామీల అమలుపై సంతకం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 నుంచి రూ. 80 వేల కోట్లు అవసరమని ఆ పార్టీ వర్గాల అంచనా. ఈనేపథ్యంలోనే ఆరు గ్యారంటీల ముసాయిదాపై తొలుత సిఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. అనంతరం మంత్రివర్గం భేటీలో ఈ ఆరు గ్యాంరటీలకు ఆమోదం తెలుపుతారు. అర్హులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసిన తర్వాత, ఆ గ్యారంటీలకు ఎంత వ్యయమవుతుందన్న విషయంలో మరింత స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్యారంటీలకు చట్టరూపం కల్పిస్తే వాటి అమలును ప్రశ్నించే హక్కు ప్రజలకు లభించనుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల వివరాలు ఇలా….
1. మహాలక్ష్మి పథకం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేర్చేలా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని మొదటి గ్యారెంటీగా సోనియా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2500ల చొప్పున అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రూ.500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకానికి ఏటా రూ.18 వేల కోట్లు అయితే లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలేంటి, ఎంతమంది మహిళలకు ఇస్తారనేది నిర్ణయించాల్సి ఉంది. ఈ పథకానికి ఏటా దాదాపు రూ.18 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులుండగా, అర్హతలు నిర్ణయించిన తర్వాత వారిలో రాయితీ ఎంతమందికి వర్తిస్తుందన్న విషయం త్వరలో తేలనుంది.
2. రైతు భరోసా పథకం : దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. రైతుల ప్రాణాలను కాపాడుకునేందుకు, రైతన్న అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే రైతు భరోసా పథకం ప్రకటించారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.15,000, పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15,000 రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమిలేని నిరుపేదలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 చెల్లిస్తామని పేర్కొన్నారు. వరి పంటకు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తామని వెల్లడించారు. కాగా, రైతుబంధు కింద మొదటి విడత నిధులు గత ప్రభుత్వం పంపిణీ చేసినందునా ఇప్పుడు రెండో విడత ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం మొదట ఇచ్చిన రూ.5,000 కాకుండా మరో రూ.10,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.
3. గృహజ్యోతి పథకం : ఈ పథకం కింద గృహ అవసరాలకు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాను అందజేయనున్నారు.
4. ఇందిరమ్మ ఇళ్ల పథకం : ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం కేటాయిస్తారు.
5. యువ వికాసం పథకం : యువవికాసం కింద కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు.
6. చేయూత పథకం : వితంతు మహిళలకు, చేనేత కార్మికులకు, వికలాంగులకు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవి, బోదకాలు బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్న వారికి, వృద్ధులకు ఆసరా పథకం కింద రూ.4,000 పింఛన్ అందజేయనున్నారు. మరోవైపు దళిత, గిరిజన బంధు కింద దళితులు, గిరిజనులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. చేయూత పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అందజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News