మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ (Test series) టీమిండియా సత్తాకు సవాల్గా మారనుంది. కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారు లేకుండానే భారత్ ఈ సిరీస్కు సిద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. సుదీర్ఘ కాలంగా రోహిత్, కోహ్లిలు భారత్కు పెద్ద దిక్కుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరు లేకుండా భారత్ ఇలాంటి పెద్ద సిరీస్లలో బరిలోకి దిగడం ఇదే తొలిసారి. వీరికి తోడు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలు కూడా జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఇది కూడా మరింత కలవర పరిచే అంశంగా చెప్పాలి. ఇక భారత టీమ్పై కోహ్లి (Kohli Indian team)తనదైన ముద్ర వేశాడు. చాలా కాలంగా టెస్టుల్లో టీమిండియా బ్యాటింగ్కు వెన్నుముఖగా నిలుస్తున్నాడు. అతను టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పడంతో భారత్కు సిరీస్లో బ్యాటింగ్ ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా కోహ్లికి ఉంది.
టెస్టుల్లో కోహ్లికి కళ్లు చెదిరే రికార్డు ఉంది. కెప్టెన్గా, ఆటగాడిగా టెస్టుల్లో భారత్కు చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన ఘనత కోహ్లికి ఉందని చెప్పాలి. అతను జట్టులో ఉన్నాడంటే చాలు ప్రత్యర్థి జట్ల బౌలర్లు ఆత్మరక్షణలో పడేవారు. ఎంత పెద్ద బౌలర్కైనా చుక్కలు చూపించే అపార నైపుణ్యం కోహ్లిలో ఉంది. అతను లేని లోటు ఇంగ్లండ్ సిరీస్లో జట్టుపై తప్పక ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుదీర్ఘ కాలం పాటు టెస్టుల్లో భారత్కు ప్రాతనిథ్యం వహించిన కోహ్లి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. బౌన్స్కు సహకరించే ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పిచ్లపై కోహ్లి టెస్టుల్లో పరుగుల సునామీ సృష్టించాడు. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్కు ముందు అతను అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది టీమిండియాకు అతి క్లిష్టమైన అంశంగా మారింది.
కోహ్లి లేకుండా ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఎదుర్కొవడం టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. అతని స్థానాన్ని భర్తీ చేయడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చినా అతను కోహ్లిల ఆడుతాడని ఊహించడం అతిశయోక్తే అవుతోంది. భారత క్రికెట్కు లభించిన ఆణిముత్యాల్లో కోహ్లిది ప్రత్యేక స్థానం. సచిన్ టెండూల్కర్ తర్వాత భారత్లో కోహ్లినే మెరుగైన బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హిట్మ్యాచ్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ కూడా భారత్కు ప్రతికూలంగా మారింది. రోహిత్ కూడా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా అతను కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ లేని లోటును పూడ్చడం కూడా చాలా కష్టంతో కూడుకున్న అంశమే. ఇలా ఇద్దరు కీలక ఆటగాళ్ల సేవలు ఒక్కసారిగా కోల్పోవడం టీమిండియాకు ఇబ్బందిగా పరిణమించింది. ఈ లోటును భారత్ ఎలా పూర్తి చేస్తుందో వేచి చూడాల్సిందే.