Sunday, April 28, 2024

భూములపై రుణాల పేరుతో కుచ్చుటోపి!

- Advertisement -
- Advertisement -

బోర్డు తిప్పేశాడు.. రూ. 2 కోట్లతో ఉడాయించాడు…
బాధితుల లబోదిబో.. సైఫాబాద్ పోలీసులనాశ్రయించిన వైనం!!

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ భూములపై రుణాల పేరుతో అమాయకులకు ఎరవేసి డిపాజిట్ల రూపంలో రూ.2 కోట్లకు పైగా దండుకుని ఆనక ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ బోర్డు తిప్పేసి పరారైన ఉదంతమిది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మోసానికి సంబంధించిన వివరాలీవిధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్ కోంపల్లిలో నివసిస్తున్నాడు. బషీర్ బాగ్ లోని బాబుఖాన్ ఎస్టేట్ నాలుగో అంతస్తులో ఫ్లాట్ నెంబర్ 407ను అద్దెకు తీసుకున్నాడు. అక్కడే కుబేర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వ్యవసాయ భూములపై తక్కువ వడ్డీకి, ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రుణాలు ఇస్తామని చెప్పుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ కూడా రూపొందించుకొని దేశ వ్యాప్తంగా 28 శాఖలు ఉన్నట్లు, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కూడా ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో చాలా మంది అమాయక ప్రజలు అతడి వద్ద రుణాలు తీసుకోవడానికి ఆసక్తి కనబర్చారు. ముందుగా ఐదు వేల రూపాయలి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయింకోవాలని, దరఖాస్తు నింపి కావాల్సిన రుణం గురించి వివరించాలని సూచించాడు. అంతేకాకుండా రుణం తీసుకునే వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, వంటగ్యాస్ రశీదు జత చేయాలని వివరించాడు.

ఆ తర్వాత సిఎ రిపోర్టు, ఇతర పత్రాలు, ప్రాసెసింగ్ ఫీజు అంటూ ఒక్కకొక్కరి వద్ద నుంచి 25, 30 వేల రూపాయలు వసూలు చేశాడు. కొందరు అధిక రుణం కోసం లక్ష నుంచి 4 లక్షలకు పైగా చెల్లించారు. ఐడిఎఫ్‌సి, బంధన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్‌ల ద్వారా రుణాలు వస్తాయని వారిని నమ్మబలికాడు. ఈ విధంగా అందినకాడికి దోచుకున్నాడు. ఇదిలా ఉండగా, కుబేర్ ఫైనాస్షియల్ సర్వీసెస్ సంస్థ పని తీరుపై అనుమానం వచ్చి బాబు ఖాన్ ఎస్టేట్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి వేణు మాధవ్ ఈనెల 21వ తేదీన సైఫాబాద్ పోలీసులకు ఇదే విషయమై ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు గత కొద్ది రోజులుగా అమిత్ కుమార్ ను ప్రశ్నిస్తుండగా సెప్టెంబర్ 26వ తేదీ నాటికి రుణాలకు సంబంధించిన చెక్కులు ఇస్తామని వెల్లడించారు. శుక్రవారం సాయం త్రం 5 గంటలకు ఇంటికి పంపించి దరఖాస్తులు, అగ్రిమెంట్లు తదితర 700 నుంచి 800 ఫైళ్లకు నిప్పు పెట్టారు. సిసి కెమెరాలు విరగ్గొట్టి ఆధారాలు లేకుండా చేశారని బాధితులు వాపోయారు. శనివారం ఉదయం వచ్చిన కొందరు బాధితులు కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మరికొందరు కంప్యూటర్లు, ఎసిలు తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, మోసపోయినట్లు గుర్తించిన ఓ బాధితుడు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News