Saturday, April 27, 2024

ఉచితాలకు హద్దు లేదా!

- Advertisement -
- Advertisement -

ఉచిత పథకాలు రాజ్యాంగబద్ధమా? అనే అంశం మరలా తెరపైకి వచ్చింది. గతంలో దీనిపై అనేక చర్చలు జరిగాయి. అత్యున్నత న్యాయస్థ్ధానం వరకూ వెళ్ళింది. ఎన్నికల సంఘం దీనిని పరిశీలన చేయాలనే సూచనలు వచ్చాయి. ప్రధాన మంత్రి మోడీ అధికారమే పరమావధిగా సంక్షేమాన్ని ఏమాత్రం పెంచని ఉచితా లు ఆర్థికాభివృద్ధికి ఆటంకం అంటూ ప్రకటన కూడా చేశారు. తాజాగా మరలా సుప్రీం కోర్టులో ఈ ఉచితాలు అనుచితం అంటూ ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. సుప్రీం కోర్టు కూడా ఈ పిల్ స్వీకరించి దీనిని అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా ప్రకటించడం జరిగింది. దేశంలో ఆర్థిక సమతుల్యత చాలా ముఖ్యం. అందరి దగ్గరా సమానంగా డబ్బు ఉండకపోవచ్చు. కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ ఉద్దేశం తోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ సంక్షేమం అనేది శృతిమించి..

ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ అన్నం సంపాదించుకునే మార్గం చూపితే జీవితాంతం ఆకలి తీరుతుంది. జీవితాంతం ఆకలి తీర్చే మార్గం చూపడమే నిజమైన అభివృద్ధి. కానీ ప్రభుత్వాలు మాత్రం శాశ్వత పరిష్కారం వైపు కాకుండా తాయిలాలు పేరిట ఉపశమనాలు కల్పిస్తూ సంక్షేమం అని గొప్పగా చెప్పుకుంటున్నాయి. దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వాలు పోటాపోటీగా ఈ రకమైన ఉచిత పథకాల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాయి. అధికారాన్ని దక్కించుకోవడమే పరమావధిగా ఎన్నికల ముందు అమలు సాధ్యంకాని ఉచిత హామీలను ఇచ్చే రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయి. దీనికి ఏ రాజకీయ పక్షం కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే వీరు అందరూ కూడా ఒక తానులో ముక్కలే. పదవులే పరమావధిగా అధికారమే అంతిమ లక్ష్యంగా ప్రజలకు ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నారు.

అంతేకాదు ఉచిత వరాల ప్రక్రియ అనేది ఒక వేలం పాటలా తయారు అయింది. ఒక రాజకీయ పక్షం ఒక ఉచితం ప్రకటిస్తే దానిని మించి మరో రాజకీయ పక్షం పోటీగా ప్రకటనలు చేస్తున్నది. శ్రేయోరాజ్య స్థాపనే లక్ష్యంగా గల ప్రభుత్వాలు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడంలో తప్పులేదు. అది ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత కూడా. దేశంలో దారిద్య్రంతో ఇబ్బందిపడుతున్న, ఆకలి కోరల్లో చిక్కుకున్న ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే ఈ బాధ్యత నిర్వహించే సందర్భంలో సంక్షేమం, అభివృద్ధి ఈ రెండూ కూడా జోడెద్దుల బండిలాగ కలిసిమెలిసి ప్రయాణం చేసే రీతిలో ప్రభుత్వాలు నడుచుకోవాలి. దీనిలో ఏ ఒక్కటి విస్మరించినా ఆర్ధిక వ్యవస్ధ ఛిన్నాభిన్నం కావడం ఖాయం. అయినా ప్రస్తుత ప్రభుత్వాలు ఈ లక్ష్యాలను పక్కన పెట్టి అధికారమే పరమావధిగా ఓటు బ్యాంకు రాజకీయాలతో జనాకర్షక ఉచిత పథకాలను ప్రకటిస్తూ ముందుకు పోతున్నాయి.

దీని వలన ప్రభుత్వ ఆదాయంలో సగభాగం ఉచిత తాయిలాలకు మిగిలిన సగభాగం ఉద్యోగుల జీతాలకు పోతున్నది. అటువంటప్పుడు అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కడ ఉంటుంది. అభివృద్ధికి సంక్షేమానికి తారతమ్యం లేకుండా పోతూ ఉంది. ప్రజలు గతంలో సమష్టి ప్రయోజనాల కోసం నాయకులను డిమాండ్ చేసే వారు. అది కాలక్రమేణా వ్యక్తిగత ప్రయోజనాల వైపు మరలిపోయింది. దీనిని గ్రహించిన నాయకులు అదే దిశగా ప్రయాణం చేసి ప్రజలను వ్యక్తిగతంగా సంతృప్తి పరచడంలో తలమునకలవుతున్నారు. అయితే ఇవన్నీ ఉపశమనాలు తప్ప శాశ్వత పరిష్కారం కాదని నాయకులకు తెలుసు.
శాశ్వత పరిష్కారానికి దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి. అవి లేకపోతే ఎప్పటికీ పేదరికం అంతం కాదు. అయితే ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరుగుతున్న మన ఎగుడుదిగుడు సమాజంలో అట్టడుగు నుంచే బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పైగా, మనది సంక్షేమ రాజ్యమని రాజ్యాంగంలో రాసుకున్నాం. అభివృద్ధిలో వారినీ భాగస్వాముల్ని చేసేలా సమ్మిళిత ప్రగతి అవసరం. అందుకై చేపట్టే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఆ ముసుగులో యోగ్యతలు, అర్హతలతో నిమిత్తం లేకుండా అమలు చేసే పథకాలు అమలు ఎప్పటికీ సమర్ధనీయం కాదు. సమష్టి ప్రయోజనాలు కోసం చేపట్టే ఉచిత పథకాలు అన్నీ ఉత్పాదకమైన విగానే భావించాలి.

ఎందుకంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇలాంటివి ఉత్పాదకతను మెరుగు పరుస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా నిత్యావసర వస్తువుల అందించడం, మధ్యాహ్న భోజన పథకం, అంగన్ వాడీల ద్వారా పిల్లలకు, మహిళలకు పోషకాహారాన్ని అందించడం ఏ ఆధారం లేని వృద్ధులుకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే ఫించన్, రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాలు వలన ఎన్నో సత్ఫలితాలు వస్తున్నాయి. ఇటువంటి వాటిని లక్ష్యం నెరవేరే వరకూ ఎప్పటికీ కొనసాగించాలి. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అదే మీరు ఒక కులానికి చెందిన వారు మీ వయసు ఇంత దాటితే నగదు బదిలీ చేస్తాం అనే పథకాలు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప సామాజిక సంక్షేమాన్ని పెంచవు. అయితే దీనికి భిన్నంగా మా ప్రభుత్వం అధికారం లోనికి వస్తే కలర్ టివి ఇస్తాం. మిక్సీ ఇస్తాం, మొబైల్ ఫోన్ ఇస్తాం, గ్రైండర్ ఇస్తాం, స్కూటీ ఇస్తాం, బంగారం ఇస్తాం అంటూ కొన్ని ప్రభుత్వాలు ప్రకటిస్తు న్నాయి.

వినోదం, విలాసాలను ఉచితంగా ఇవ్వడం సంక్షేమం అవుతుందా? మతపరమైన యాత్రల కు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం, వివాహాలకు బహుమతి అందించడం వంటి వాటిని సంక్షేమ కార్యక్రమాలు అనవచ్చా? దీనికి పోటీగా రాజకీయ పక్షాలు ఈ తరహా మరిన్ని తాయిలాలు ప్రకటించుకుంటూ పోతే నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అనే ఆలోచనే ప్రభుత్వాలకు స్ఫురించడం లేదు. దీనితో పాటు ఎవరి కోసం సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి నిధులు ఖర్చు చేస్తే ఆ వర్గ ప్రయోజనాలు మెరుగవ్వాలి. అయితే సంక్షేమ ఉచితాలను పొందే వారిలో దాదాపు 30% శ్రీమంతులు ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వాలకు తెలియంది కాదు. పేద ప్రజలకు చెందాల్సిన సంక్షేమ నిధులు శ్రీమంతులకు కట్టబెట్టి సమాజంలో మరింత ఆదాయ అసమానతల పెంపుకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఏది సంక్షేమ కార్యక్రమం, ఏది కాదు అనే తేడా కూడా గుర్తించలేనంత స్ధితిలో నేడు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పేదలకు అందించే ఉచిత పథకాలను విమర్శించేవారు పెద్దలకు అందించే ప్రయోజనాలు గురించి మాట్లాడటం లేదు.

ఒక వ్యవస్థ ద్వారా పేదలకు ఇచ్చే కొద్దిపాటి మొత్తాలను ఉచితాలు అంటున్నారు. కానీ తక్కువ పన్ను రేట్లు, మినహాయిం పుల పేరుతో నిత్యం ధనవంతులు పొందుతున్న ఉచితాలను మాత్రం ప్రోత్సాహకాలు అంటున్నారు ఇదెక్కడి న్యాయం అంటూ సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపుదల, సామాజిక అభివృద్ధి సాధన కోసం ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పథకాలు ఎప్పటికీ కొనసాగించాలి. అయితే ప్రజాకర్షణ కోసం సర్కారు ఖజానాని దివాలా తీయించే ఉచిత తాయిలాల ప్రకటన ఏ మాత్రం సమర్ధనీయం కాదు. అధికారమే పరమావధి ఓటు బ్యాంకు రాజకీయాలతో ఉచిత పథకాలు నగదు బదిలీ వంటివి చేస్తూ ఇది కూడా సంక్షేమమే అంటూ ఆర్థిక క్రమశిక్షణ గతి తప్పించడాన్ని ఎవరూ క్షమించకూడ దు.

సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు, ఉచితాలు, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే రాజకీయ పక్షాలకు ఓటర్లు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సందర్భాలలో ప్రభుత్వాలు ప్రకటించి న ఉచిత పథకాలు పొందే లబ్ధిదారు లు సైతం ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడ నుంచి తీసుకువస్తారని ప్రభుత్వాలకు ఆ మాత్రం స్పృహ లేదు. ఏదిఏమైతేనేం అధికారం కావాలి.. నిధులు కొరత అయితే కొత్త పన్నులు వేస్తారు. అదీ సాధ్యం కాకపోతే రుణాలు చేస్తారు. దురదృష్టం ఏమిటంటే నేడు దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం మొత్తం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు చెల్లించడానికి సరిపోవడం లేదు. కేంద్రం నుంచి ఆదాయం, కొత్త అప్పుల ద్వారా ఉచితాల సంతర్పణ చేసుకుంటూ పోతూ భావితరాల ప్రయోజనాలను తాకట్టు పెట్టే అధికారం మనకు ఎక్కడిది?

రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News