Saturday, April 27, 2024

కాంగ్రెస్ శ్రేణుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలి
మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు
దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయి

మనతెలంగాణ/హైదరాబాద్ :  దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని, ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్‌ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 140 కోట్ల భారతీయులకు రేవంత్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అహింస మార్గంలో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కును కల్పించింది అంబేడ్కర్ అని, కరువు-కాటకాలతో తల్లడిల్లుతున్న దేశానికి సంక్షేమ ఫలాలు అందించిన మహానేత నెహ్రూలని అందుకే ఈ ముగ్గురిని స్మరించుకోవాలని రేవంత్ పేర్కొన్నారు. వీరిని తలచుకొని నివాళులు అర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
దేశంలో విభజించు పాలించు విధానాన్ని బిజెపి అవలంభిస్తోంది
ఈ క్రమంలోనే దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటీష్ జనతా పార్టీ అవలంభిస్తోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విద్వేషాలను వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని ఆయన వివరించారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 60 ఏళ్లలో చేసిన అప్పుల కంటే ఎనిమిదేళ్లలో మోడీ రెండింతలు అప్పు చేశారని ఆయన ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని రేవంత్ విమర్శించారు. మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని ఆయన విమర్శించారు. మణిపూర్‌లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సిందిపోయి కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈడీ, సీబిఐని పంపించారని రేవంత్ ఆరోపించారు. దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలంటే అది కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటా మన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి గడపకు వెళ్లి ప్రతి తలుపు తడుదాం రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News