Sunday, June 8, 2025

మరోసారి భగ్గుమన్న మణిపూర్

- Advertisement -
- Advertisement -

మణిపూర్ ఆదివారం మరో సారి భగ్గుమంది. తెగల మధ్య ఇన్నాళ్ల సంకుల సమరం మరింత అరాచకానికి దారితీసింది. మైతీ తెగ నాయకుడు అరంబాయ్ టెన్గోల్ (ఎటి) వర్గం నాయకుడు కన్నన్‌సింగ్ అరెస్టు తరువాత నిరసనలు చెలరేగాయి. ఈ దశలోనే నిరసనకారులు తమ వంటిపై పెట్రోలు పోసుకుని , ఆత్మాహుతికి పాల్పడుతామని బెదిరించిన ఘటనల వీడియోలు ఇప్పుడు మణిపూర్ అంతటా ప్రచారంలోకి వచ్చాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది. ఇంఫాల్ లోయ ప్రాంతంలోని ఐదు జిల్లాలో వెంటనే ఇంటర్నెట్ సౌకర్యం నిలిపివేశారు. వదంతులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతా బలగాలు పలు చోట్ల పహారా సాగిస్తున్నాయి. జిల్లాల్లో నిషేధాజ్ఞలు వెలువరించారు. శనివారం రాత్రి మైతీ తెగ నేతను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వీధులలోకి వచ్చారు.

కొన్ని ప్రాంతాలలో నల్లటి దుస్తులు వేసుకున్న నిరసనకారులు తమను తాము కాల్చుకుంటామని బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ నేతను విడిచిపెట్టాలని నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. ఈ దశలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పలు చోట్ల తెగల నడుమ ఘర్షణలు చోటుచేసుకుంటున్నట్లు అనధికారిక వార్తలు వెలువడ్డాయి. తమ ముందు కన్పించిన ప్రభుత్వ సిబ్బందితో నిరసనకారులు ఘర్షణలకు దిగారు. దీనితో వీరిని అదుపులో పెట్టడం సమస్య అయింది. భద్రతా బలగాలతోనే నిరసనకారులు తలపడిన వార్తలతో ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఇంఫాల్‌లో పరిస్థితి దిగజారింది. ఓ గుంపు ఖురాయ్ లాంలంగ్ ప్రాంతంలో ఓ బస్సుకు నిప్పు అంటించింది. రాజ్‌భవన్‌కు అతి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు శ్రమించాల్సి వచ్చింది. పలుసార్లు భాష్పవాయువు ప్రయోగించారు. కొన్ని ప్రాంతాలలో అల్లరిమూకలు కాల్పులు జరిపిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే వీటిపై అధికారులు ఎటువంటి ప్రకటన వెలువరించలేదు.

ఇప్పటి ఘర్షణలకు మూలం ఇదే
2023 మణిపూర్ ఘర్షణలకు సంబంధించి పలు నేర కార్యకలాపాలకు పాల్పడినందుకు మైతీ తెగ నేత , కన్నన్‌సింగ్ అరెస్టు ఇప్పటి ఘర్షణలకు దారితీసింది. ఆయనను శనివారం స్థానిక ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. దీనితో అక్కడికి ఆయన మద్దతు దార్లు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు ప్రధాన ద్వారం వద్ద గుమికూడారు. తమ నేతను రాష్ట్రం నుంచి తరలించకుండా అడ్డుకునేందుకు యత్నించారు. కన్నన్‌సింగ్ అక్రమ కార్యకలాపాలపై పలు కేసులు ఉన్నందున సిబిఐ అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. నిరసనకారుల కన్నుగప్పి ఏదో విధంగా కన్నన్‌ను ఇంఫాల్ నుంచి గువహతికి తరలించారు, సంబంధిత కోర్టులో హాజరుపరుస్తారని వివరించారు. ఘర్షణల తరువాత పలువురిని అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలు , కత్తులు కటార్లు స్వాధీనం చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. కాగా ఉద్రిక్త ప్రాంతాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంత వరకూఇండ్లలోనే ఉండాలని హెచ్చరించారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News