Sunday, April 28, 2024

చంద్రబాబు ఆరెస్టు దురదృష్ట కరం: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : ఈ వయస్సులో మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మం డలం నర్మెట గ్రామ శివారులో రూ. 300 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆయిల్ పామ్ కర్మాగారానికి ఆయన భూమి పూజ చేసి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేదన్న చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుందని నిజం మాట్లాడారని అన్నారు. గతంలో ఐటి ఐటి అన్న చంద్రబాబు తెలంగాణ రైతులకు కెసిఆర్ పాలన బాగు చేసిండు అని మంచి మాట అన్నారన్నారు. 50ఎండ్ల కాంగ్రెస్ పాలనలో ఆకలిచావులు, బీడు పడ్డ భూములు, అన్ని కోతలు, వాతలే కనబడేవన్నారు. సిఎం కెసిఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోనే వ్యవసాయంలో ఇంత పెద్ద గొప్ప మార్పు వచ్చిందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు.

బిస్కెట్లల ట్రాన్స్‌ఫార్మర్లను ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం కాల్వలపై పైపులు వేసి మోటర్ల ద్వారా రైతులు సాగునీటిని తీసుకుంటున్నారన్నారు. ఉచిత కరెంట్, ఉచిత నీటిని అందించడంతో పాటు రైతుబంధును అందించడంతోనే రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరగడంతో పాటు ఆర్థ్ధిక ంగా ఎదుగుతున్నారన్నారు. రైతులను లక్షాదికారులుగా చేయడమే లక్షంగా సీఎం కేసీఆర్ కృషి చేశాడన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేసింది సీఎం కేసీఆరేనన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చేదా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేదా అని అన్నారు. కాంగ్రెసోళ్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెసోళ్ల మూడు గంటల కరెంట్ కావాలా లేక మూడు పంటలు పం డాలన్న కెసిఆర్ కావాలా అని ప్రజలే తేల్చుకోవాలన్నారు. దేశాన్ని పాలించిన పాలకుల నిర్లక్షంతోనే ఇతర దేశాల నుంచి లక్ష 50 వేల కోట్ల రూపాయల ఆయిల్ ను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. మందు చూపు లేకనే ఇలాంటి పరిస్ధితులు నెలకొన్నాయన్నారు.

అదే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలన్న లక్షంతో ముందుకు సాగుతున్నారన్నారు. తిప్పలు లేకుండా అతిగా లాభాలు ఇచ్చేది ఒక ఆయిల్ పామ్ సాగు అన్నారు. దేశ వ్యాప్తంగా 70 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సాగు పర్యావరణాన్ని కాపాడుతుందని అలాగే ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగి జీతం వచ్చేలా ఈ పంట సాగు చేసే రైతుకు సైతం ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయి చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్‌లు నిండుకుండల్లా నిండి ఉండడంతోనే గాలిలో తేమ శాతం పెరిగి ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారిందన్నారు. గత పాలకుల హాయంలో ఎటు చూసినా కరువు ఉండేదని అదే సీఎం కేసీఆర్ 9 ఎండ్ల పాలనలో కరువు కనుమరుగైందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తెలుగులో మెలుకువలతో కూడిన డైరీని అందించాలన్నారు. కాంగ్రెసోళ్లు ఇస్తున్న ఉచిత హమీలు ఉత్తుత్తవేనన్నారు.

బిజేపి పాలిత ప్రాంతాలలో తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ గాలిలో దీపంలా ఉండేదని కేసీఆర్ పాలనలో నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. అన్నదాతలకు ఆయిల్ ఫామ్ అభయ హస్తం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ ఫెడరేషన్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, హర్టి కల్చరర్ శాఖ కమిషనర్ హనుమంతరావు, జడ్పీ చైర్ పర్సన్ వేలాటి రోజా రాదాకృష్ణశర్మ, ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆదనపు కలెక్టర్ గరిమా ఆగ్రవాల్, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రజాప్రతినిధులు , నాయకులు వంగ నాగిరెడ్డి, మారెడ్డి రవీంరద్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వేలేటి రాదాకృష్ణశర్మ, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోంరెడ్డి, రాగుల సారయ్య, శ్రీహరిగౌడ్, దువ్వల మల్లయ్య, కూరమాణిక్యరెడ్డి, శ్రీహరి, తిరుపతి, కనకరాజు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News