Saturday, July 27, 2024

అబద్దాలలో పోటీ పడుతున్న కాంగ్రెస్ నాయకులు:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలనలో అబద్దాల పోటీ కొనసాగుతోందని బిఆర్‌ఎస్ అగ్రనేత, సిద్దిపేట ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుల రుణమాఫీపై సిఎం, డిప్యూటీ సిఎం పోటీపడి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైందని వ్యాఖ్యానించారు. అబద్ధాల్లో సిఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసుపాలైన భట్టి.. తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడత పెట్టారని పేర్కొన్నారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమే అని మండిపడ్డారు.

డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీపైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అని విమర్శించారు. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారని అన్నారు. నిన్న నిరుద్యోగ భృతిపై ఎగవేత – నేడు రైతు రుణ మాఫీపై దాట వేత ధోరణి ప్రదర్శిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవిగో సాక్ష్యాలు అంటూ హరీశ్‌రావు ఎక్స్‌లో వీడియోను పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News