Friday, May 3, 2024

సానుకూల పవనాలతోనే హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -

జ్యోతిబసు, నవీన్ పట్నాయక్ల తరహాలోనే మాకూ వ్యతిరేకత లేదు

‘ఇండియాటుడే’ ఇంటర్వూలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) సుమారుగా 100 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిచే స్థానాలు 2018 కంటే అధికంగా ఉం టాయని, 95 నుంచి 100 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామని పేర్కొన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ప్ర త్యేక ఇంటర్వ్యూలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలు అంశాలపై వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. సమకాలీన రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏ రాష్ట్రానికైనా తలసరి ఆదాయం బెంచ్‌మార్క్
ఏ రాష్ట్రానికైనా నెంబర్‌వన్ బెంచ్‌మార్క్ తలసరి ఆదా యం అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రస్తుత తలసరి ఆదాయం రూ. 3.12 లక్షలు అని, గో వా వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే, మనం నంబర్ వన్ అని పేర్కొన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పు డు తలసరి ఆదాయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉం ది అని, ఇప్పుడు అది మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. రెండవ బెంచ్‌మార్క్ తలసరి విద్యుత్ వినియోగం అని, 2014లో ఇది 1,100- యూనిట్లు మాత్రమే అని, ఇప్పు డు అది 2,200 యూనిట్లకు దగ్గరగా ఉందని, ఇది రెట్టింపు అని అన్నారు. శక్తిని ఉపయోగించడం అంటే పురోగతి అని పేర్కొన్నారు. మూడవ బెంచ్‌మార్క్ నిరుద్యోగం తగ్గింపు అని, రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఇది 14- నుంచి 15 శాతానికి పైగా ఉందని, ఇప్పుడు అది 5 శా తం కంటే తక్కువగా ఉందని తెలిపారు. ఇవి కేంద్ర ప్రభు త్వ గణాంకాలు అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు వలసల సమస్య ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారయ్యిందని గర్వంగా చెప్పగలనని అన్నారు. తెలంగాణకు డజనుకు పైగా రాష్ట్రాల నుండి కార్మికులు పని చేయడానికి వస్తున్నారు, వారి సంఖ్య 2.5 మిలియన్లకు పైగా ఉంటుందని అంచనా అని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన జిఎస్‌డిపి దాదాపు మూడు రెట్లు పెరిగిందని వెల్లడించారు.

అధికార పార్టీకి అనుకూలత ఉంది
తెలంగాణలో అధికార పార్టీకి అనుకూలత ఉందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అధికార పార్టీ అనుకూలతతో జ్యోతి బసు, నవీన్ పట్నాయక్ అనేక పర్యాయాలు గెలి చి, రాష్ట్రాలను పాలించారని ఉదహరించారు. కెసిఆర్ ఎ ప్పుడూ ఏ విషయంలో ఆందోళన చెందరు అని, రెండు సార్లు పోటీ చేయడానికి గల కారణాలు ఎన్నికల ఫలితా లు వచ్చిన తర్వాత వెల్లడిస్తానని అన్నారు. మా పార్టీ ఎం ఎల్‌ఎలలో ఎక్కువ మంది ఉద్యమంలో ఉన్నవారే అని, అందుకే ఇప్పుడు సిట్టింగ్‌లను మార్చలేదు… 2018లో నూ ఎంఎల్‌ఎ అభ్యర్థులను మార్చలేదని వివరించారు. తమ పార్టీ అభ్యర్థుల నిబద్ధత ఏంటో తనకు తెలుసు అని, అధికార పార్టీకి అనుకూలత ఉన్నప్పుడు, మా సిట్టింగ్‌ల ను ఎందుకు మార్చాలి..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా తనకు రాష్ట్ర అవసరాలు ఏం టో తెలుసు అని, కీలక అంశాలపై కచ్చితత్వంతో నిర్ణ యం తీసుకుంటానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అయి తే అన్ని అంశాలలో తాను మాత్రమే నిర్ణయాలు తీసుకోనునని స్పష్టం చేశారు. కొందరికి అది నచ్చకపోవచ్చు అని అన్నారు. కానీ క్యాబినెట్‌లో నిర్ణయాలు తీసుకునే ముందు చాలా సుదీర్ఘంగా చర్చించి, అత్యంత ప్రజాస్వా మ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

ఉద్యమ సమయంలో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తాను ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసేవారిమి అని, ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, -కరెంటు లేదు, తాగునీరు లేక సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కాబట్టి, ప్రొఫెసర్ కె. జయశంకర్ జి.ఆర్.రెడ్డి వంటి అగ్రశ్రేణి ఆర్థికవేత్తలతో మేధోమథనం చేసి జాగ్రత్తగా అభివృద్ధి ప్రణాళిక లు రూపొందించామని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు నీరు అందుబాటులో ఉంచి వలసలను అరికట్టామని అన్నారు. తాము 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు వరి సాగు కేవలం 7 మి లియన్ టన్నులు మాత్రమే అని, అది ఇప్పుడు అది 26 మిలియన్ టన్నులకు పైగా ఉందని చెప్పారు.

అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ విధానం
మైనార్టీలు సహా ప్రతి వర్గం సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ విధానమని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. వారికి అన్ని సంక్షేమ పథకాల ఫలాలు సమానంగా అం దాలని అన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్‌ల ను వేరుగా భావించడం అర్థరహితం అని పేర్కొన్నారు. ముస్లింలు ముస్లింలుగా ఉన్నందుకు ఎందుకు బాధపడాలి..? అని ప్రశ్నించారు.

బుల్డోజర్లు పెట్టి ఇళ్లు కూల్చడం మా పని కాదు
బుల్డోజర్లు పెట్టి ఇళ్లు కూల్చడం తమ పని కాదు అని, ఆ విధానాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు లా అండ్ ఆర్డర్ డిపార్ట్‌మెంట్ ఉంది, న్యాయవ్యవస్థ ఉం ది అని, అది వారి పని అని పేర్కొన్నారు.

రైతులకు పెట్టుబడి ఇవ్వాలనే రైతుబంధు
రైతుల సంక్షేమ పథకాలపై తాను వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీతో అనేక ఆలోచనలు చేశానని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సహకారంతో నే వ్యవసాయం సాగుతుందని ఆయన తనకు చెప్పారని అన్నారు. రైతులకు మద్దతు ఇవ్వకపోవడమే కాకుండా వారి నుండి తీసుకునే ఏకైక దేశం భారతదేశం అని, కాబట్టి, వారికి నగదు మద్దతు ఇవ్వాలని ఆయన తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అందుకే రైతుబంధు పథకాన్ని ప్రారంభించి రైతులకు ప్రతి పంటకు పెట్టుబడిగా ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందించామనిని వివరించారు. రైతులే కాదు, ఇతర వర్గాలకు ముఖ్యంగా వి తంతువులు, వృద్ధులతోపాటు అన్ని రకాల నిరుపేదలకు సంక్షేమంపై దృష్టి సారించి, వారికి నెలకు రూ.2 వేల పింఛన్లు ఇచ్చామని తెలిపారు.

పారదర్శకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో ఎలాంటి అవినీతికి తావు లేదు అని, పూర్తి పారదర్శకంగా లాటరీ విధానంలో ఇళ్లు కేటాయించామని సిఎం కెసిఆర్ చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో ఎంఎల్‌ఎలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి పంపిణీ చేశామని తెలిపారు.

కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి అని ఆరోపించడం కాంగ్రెస్ మూర్ఖత్వం
రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఉన్నందున సమర్థవంతం గా పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించామ ని కెసిఆర్ తెలిపారు. మొదటి టర్మ్‌లో పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టులు రెండింటిపైనా దృష్టి సారించామని చెప్పారు. రెండు ప్రధాన నదులైన -కృష్ణా, గోదావరి- నదీగర్భాల మట్టాలు తక్కువగా ఉన్నందున, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి నీటిని 500 మీటర్లకు పైగా ఎత్తివేయవలసి ఉన్నందున ఖరీదైనప్పటికీ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఉపయోగించడం తప్ప లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్ట్ అని, వందల సంఖ్యలో పిల్లర్లు ఉంటే, అందులో ఒక్కటి మాత్రమే కూలిపోయిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ అండ్ టి కంపెనీ ద్వారా నిర్మాణం జరిగిందని, ఏదైనా తప్పు జరిగినా, వారు తమ ఖర్చుతో సరిచేస్తారు- కాబట్టి, ఖజానాకు ఎటువంటి నష్టం లేదని తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లు కాగా కెసిఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడం కాంగ్రెస్ మూర్ఖత్వమని విమర్శించారు.

కాంగ్రెస్ విధానం ఒక్కో రాష్ట్రంలో భిన్నంగా  ఉంటుంది
కాంగ్రెస్ ఫ్లాప్ పార్టీ అని, డిఫాల్ట్‌గా ఎన్నికల్లో గెలిచే అలవాటును పెంచుకున్న పార్టీ అని కెసిఆర్ విమర్శించారు. ఇది వ్యవస్థ లేని దురహంకార పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ విధానం రాష్ట్రానికి రాష్ట్రం భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. కర్నాటకకు వెళ్లి ఒక మాట, తెలంగాణకు వెళ్లి ఇంకో మాట, రాజస్థాన్ వెళ్లి మరో మాట చెబుతారని ఆరోపించారు. జాతీయ పార్టీ అని పార్టీకి నిబద్దత ఉండాలని, కానీ కాంగ్రెస్‌లో అది లోపిస్తుందని చెప్పారు. ఇండియా కూటమి ఇప్పుడు విరిగిపోయిందని, అందు లో ఉన్న అఖిలేష్ యాదవ్‌లను, నితీష్ కుమార్ రోజూ తిట్టుకుంటూనే ఉన్నారని అన్నారు.

అబ్ కీ బార్, కిసాన్ సర్కార్
మహారాష్ట్రలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్రలో దాదాపు 2.5 మిలియన్ల మంది బిఆర్‌ఎస్ పార్టీలో చేరారని, ఇది దేశంలోని అందరికీ పెద్ద ఆశ్చర్యం కలిగిందని అన్నారు. దేశ రాజకీయాలలో తాను కీలక పాత్ర పోషించవలసి ఉందని, ఇక్కడి నుంచే ఆ ప్రయత్నం చేస్తానని చెప్పారు. భారతదేశం వంటి దేశంలో పేదలకు, నిరుపేదలకు సంక్షేమం ఉండాలని, వ్యవసాయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించరాదని సిఎం కెసిఆర్ అన్నారు. అదే సమయంలో పరిశ్రమలు అవసమరని వ్యాఖ్యానించారు. భారతదేశం యుఎస్‌ఎ, చైనా వంటి దేశాల మాదిరిగా కాకుండా, గొప్ప వనరులు ఉన్న దేశం అని, మనకు చాలా సాగు భూమి ఉందని తెలిపారు. మన జనాభా విపరీతంగా ఉంది కాబట్టి కూలీల కొరత లేదు అని, మన అవసరాలకు మించిన నీరు ఉంది అని చెప్పారు. ఈ మూడింటిని ఒకచోట చేర్చి, ప్రపంచ ఆహార మార్కెట్‌ను పట్టుకోవచ్చని అన్నారు. 2024లో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని తాను విశ్వసిస్తానని… అబ్ కీ బార్, కిసాన్ సర్కార్ అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News