పాట్నా : ఓ భర్త తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్లోని సీతామర్హి లో చోటుచేసుకుంది. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్ టీమ్ జవాన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న చంద్రభూషణ్ మొదట తన భార్య మధును తుపాకీతో ఏడు సార్లు కాల్చి ఆపై తానూ కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టమ్కు తరలించి కేసు నమోదు చేశారు. వీరి వివాహం జరిగి ఆరు నెలలు కావొస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.