Sunday, April 28, 2024

కాంగ్రెస్ కొత్త సిఎంకు శాసనమండలి అడ్డంకి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌కు ఒక్కడే సభ్యుడు…బిల్లులు ఎలా పాస్..!?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కావాల్సిన మెజార్టీ ఉంది. కానీ ఆ పార్టీకి శాసనమండలిలో అసలు బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు జీవన్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. పెద్దల సభలో బిఆర్‌ఎస్‌కు పూర్తి అధిక్యం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎంఎల్‌సిల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎంఎల్‌సిలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. కానీ రెండు గవర్నర్ కోటా ఎంఎల్‌సి స్థానాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు ఎంఎల్‌సి స్థానాలకు కూడా గతంలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లను కెసిఆర్ సిఫారసు చేశారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు.  కానీ వారి పేర్లను  గవర్నర్‌కు పంపలేదు. దీంతో ఆ రెండు గవర్నర్ కోటా ఎంఎల్‌సిలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లభించింది. వీరితో కలిస్తే కేవలం ముగ్గురు మాత్రమే తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు ఉంటారు.

శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా బిఆర్‌ఎస్‌కు 28 మంది ఎంఎల్‌సిలు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎంఎల్‌సిలు పోటీచేసి గెలుపొందారు. దీంతో వారు శాసనమండలి మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరిలో బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన శాసన సభ కోటా ఎంఎల్‌సిలైన కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి , పట్టభద్రుల కోటా ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి గెలుపొందారు. ప్రస్తుతం మండలిలో మజ్లిస్‌కు ఇద్దరు సభ్యులు, బిజెపికి ఒక సభ్యుడు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. మిగిలిన 28 మంది బిఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. దీంతో మండలి సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మాత్రం త్వరలోనే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. శాసనమండలి కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారనుంది. ఎవరికైనా ఎంఎల్‌సిలు ఇచ్చి మంత్రి పదవుల్లోకి తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి ఈ గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా పదవి ఇచ్చే అవకాశం ఉంది. పదేళ్లుగా కాంగ్రెస్ నేతలకు పదవులు లేక ఇబ్బంది పడుతున్నారు. పార్టీనే నమ్ముకున్న వారికి రేవంత్ ఆ రెండు సీట్లను ఇచ్చే అవకాశం ఉంది. గత తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ ఆమోదించినట్లయితే ఎంఎల్‌సిలుగా ఆరేళ్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వారికి మళ్లీ చాన్స్ రాదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News