హోటల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటి, షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.5కిలోల హెరాయిన్, కిలో గంజాయి, 2.8 కిలోల పప్పీస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.3,05,27,700 ఉంటుంది. నిందితుడికి డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం, నాగౌర్, దిడ్వానా, మౌలాసార్ గ్రామానికి చెందిన వికాస్ సోహు షాద్నగర్ పిఎస్ పరిధిలోని రాయకల్ టోల్గేట్ సమీపంలోని సంజు భాయ్ మార్వాడి దాబాలో కుకింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. బతుకు దెరువు కోసం 2019లో షాద్నగర్కు వచ్చిన నిందితుడు ముందుగా దాబాలో వాచ్మెన్గా పనిచేసేవాడు.
వంట నేర్చుకున్న తర్వాత దాబాలో వంట వాడిగా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి విక్రయిస్తున్నాడు. తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. తనకు తెలిసిన వారికి మాత్రమే నిందితుడు డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. లారీ డ్రైవర్లు, స్థానికులకు ఎక్కువగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. నిందితుడు గతంలో కూడా గంజాయి తీసుకుని వచ్చి జడ్చర్ల లో విక్రయిస్తుండగా 2022లో పోలీసులు అరెస్టు చేశారు. 25గ్రాములను రూ.300లకు కొనుగోలు చేసి రూ.500లకు గ్రాము విక్రయించేవాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గణపత్ నుంచి ఓపియం, 10 గ్రాములు ఓపియం కొనుగోలు చేసి రూ.2,000లకు, గ్రాము హెరాయిన్ను రూ.12,000లకు కొనుగోలు చేసి రూ.15,000లకు విక్రయించేవాడు.
ఏప్రిల్28, 2025లో దాబా యజమాని మృతి చెందడంతో అప్పటి నుంచి వికాస్ సోహు దాబాను నడిపిస్తున్నాడు. అందులోనే డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టి డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి రాజేష్, మాదాపూర్ ఎస్ఓటి డిసిపి శోభన్కుమార్, ఎడిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్స్పెక్టర్లు సంజయ్, విజయ్ తదితరులు పట్టుకున్నారు.