హైదరాబాద్: రంజీ సీజన్లో హైదరాబాద్ తొలి విజయాన్ని అందుకుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం చివరి రోజు 155 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కేరళ రెండో ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆలౌటైంది. రోహన్ (44), వికెట్ కీపర్ విష్ణు (44), సల్మాన్ (30), అక్షయ్ (30) మాత్రమే రాణించగా మిగతావారు విఫలమయ్యారు.
హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ మూడు, రవికిరన్, మెహది హసన్, సాకేత్ సాయిరాం రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక, తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించడంతో హైదరాబాద్కు విజయం కోసం 155 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. దీన్ని 42 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి హైదరాబాద్ అందుకుంది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (32), అక్షత్ (32) శుభారంభం అందించారు. వికెట్ కీపర్ మల్లికార్జున్ (38), కెప్టెన్ హిమాలయ్ అగర్వాల్ 34 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంది. ఇక, తొలి ఇన్నింగ్స్లో కేరళ 164 పరుగులకే కుప్పకూలింది. కొల్ల సుమంత్ 111 (నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో హైదరాబాద్ మొదటి ఇన్నింగ్స్లో 228 పరుగులు చేసింది.