Wednesday, April 24, 2024

అట్టహాసంగా ఢిల్లీలో బిఆర్‌ఎస్ భవన్ ప్రారంభోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన ఈ భవనాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కెసిఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసి కెసిఆర్ భవనంలోకి ప్రవేశించారు. భవన్‌లో దుర్గామాత అమ్మవారికి కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం భవనంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌లో కెసిఆర్ వెళ్లి కుర్చీలో ఆసీనులయ్యారు. పత్రాలపై సంతకాలు చేసిన తరువాత ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కెసిఆర్‌కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ బాధ్యతలు స్వీకరించే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కెటి రామారావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డిలు ఉన్నారు.
రెండు కిలోమీటర్ల పరిధిలో స్వాగత తోరణాలు
బిఆర్‌ఎస్ భవన్ ప్రారంభోతోత్సవం సందర్భంగా బిఆర్‌ఎస్ భవన్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కె. చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలుకుతూ పోస్టర్లు, బ్యానర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. ప్రారంభోత్సవం సందర్భంగా బిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయ ఆవరణలో యాగం, స్తోత్ర పారాయణాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే కార్యాలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు బారులు తీరారు. దీంతో బిఆర్‌ఎస్ భవన్ పరిసరాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు మధ్య ముఖ్యమంత్రి కెసిఆర్ రాక కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని, పుష్పగుచ్ఛాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. బిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు.
మెట్రోస్టేషన్ నుంచి బిఆర్‌ఎస్ భవన్ వరకు భద్రత కట్టుదిట్టం
బిఆర్‌ఎస్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా బిఆర్‌ఎస్ కార్యాలయం దగ్గర తెలంగాణ పోలీసులతో పాటు, ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వసంత విహార్ మెట్రో స్టేషన్ నుంచి బిఆర్‌ఎస్ భవన్ వరకు భద్రత కట్టుదిట్టం చేశారు. దీంతో సాధారణ వాహనాల రాకపోకలను ఆపివేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బిఆర్‌ఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభమయ్యింది.
ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిండెంట్‌లకు ప్రత్యేక ఛాంబర్లు
వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం అత్యంత వైభవోపేతంగా బిఆర్‌ఎస్ భవన్ కార్యాలయం రూపుదిద్దుకుంది. బిఆర్‌ఎస్ మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఉంది. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిండెంట్‌లకు ప్రత్యేక ఛాంబర్‌లను కేటాయించారు. వీటితో ఇతర అవసరాల కోసం మొత్తం పద్దెనిమిది గదులను భవన్‌లో నిర్మించారు. పార్టీ సమావేశాల కోసం భవన్‌లో విశాలమైన సమావేశ మందిరాన్ని కేటాయించారు. దేశ రాజధాని కేంద్రంగా బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కావడంతో పార్టీ విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి.
2021, సెప్టెంబర్ 2న భూమి పూజ
ఢిల్లీ వసంత్ విహార్‌లో బిఆర్‌ఎస్ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబర్ 2న సిఎం కెసిఆర్ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ప్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్లు, మొదటి అంతస్థులో బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కెసిఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపిలు కేశవరావు, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News