Tuesday, April 30, 2024

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తాలో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలు ఎంఎల్‌సి గోరేటి వెంకన్న తదితరులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొగల్ పాలకుల దౌర్జన్యాలకు , నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మరాఠయోధుడు చత్రపతి శివాజీ సమకాలికులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు గడ్డపై తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసి గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి,వర్ధంతులను అధికారికంగా నిర్వహించడంతోపాటు చారిత్రక ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు మతాలకు వృత్తుల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలను రద్దుచేసి గౌడ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి చెట్లను నాటుతున్నమన్నారు . నీరా తదితరాలతో కల్లుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలకు ఔషధ గుణాలున్న నీరాను అందిస్తున్నామన్నారు. గీత కార్మికులు సాహసోపేతమైన వృత్తిని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి కల్లు, నీరాను అందించి క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధమైన రోగాల నుండి ప్రజలను కాపాడుతున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు వీటితోపాటు వైన్ షాప్ లలో 15శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కులాలను మతాలను సమానంగా ఆదరిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్ల్లె రవి కుమార్ గౌడ్, స్థానిక జడ్పిటిసి జంగారెడ్డి ,సర్పంచి శమంతకమణి, ఈసీ శేఖర్ గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News