Friday, April 26, 2024

భారత్ క్లీన్‌స్వీప్

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. రెండు టెస్టుల సిరీస్‌ను 20తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియా ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మీర్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో భారతజట్టు ఆదివారం మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

రవిచంద్రన్ అశ్విన్ 42పరుగులు, శేయస్ అయ్యర్ 29పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.74పరుగులకే 7వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరూ 8వ వికెట్‌కు 71పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌తోపాటు సిరీస్ విజయాన్ని అందించారు. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకోగా నయావాల్ పుజారా ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

ఆదుకున్న అశ్విన్, అయ్యర్

ఆదివారం నాలుగోరోజు ఆట మొదలైన కాసేపటికి బంగ్లాదేశ్ జయదేవ్ ఉనద్కత్ వికెట్‌ను పడగొట్టింది. ఉనద్కత్ (13)ను షకీబ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్‌కు పంపాడు. 56పరుగుల వద్ద టీమిండియా 5వ వికెట్ కోల్పోయింది. అనంతరం అక్షర్‌పటేల్ దీటుగా ఆడి మెరవడంతో భారతశిబిరంలో ఆశలు చిగురించాయి. జతకట్టిన పంత్ రాణిస్తే జట్టు విజయం ఖాయమని అభిమానులు ఆశించినా పంత్ నిరాశపరిచి 9పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అక్షర్‌పటేల్ 34పరుగులు చేసి హసన్ మిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 74పరుగుల వద్ద 7వ వికెట్‌పడింది. అక్షర్, పంత్ తర్వాత అయ్యర్ జతకట్టారు. వీరిద్దరూ ఇన్నింగ్స్ బాధ్యతను తమ భుజాలపై వేసుకుని ముందుకు తీసుకువెళ్లారు.

వీరిద్దరూ మరో వికెట్ పడకుండా పోరాడి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. భారతజట్టును భయపెట్టిన మెహిది హసన్ మిరాజ్‌కు అశ్విన్ 47వ ఓవర్లో చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో మెహిది వేసిన తొలిబంతిని అశ్విన్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సింగిల్‌హ్యాండ్‌తో సిక్సర్‌కొట్టి అదరగొట్టాడు. అనంతరం ఇదే ఓవర్లో చివరి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. ఈ ఓవర్లో భారత్ ఖాతాలో 16పరుగులు చేరడంతో టీమిండియా విజయం ఖరారైంది. మొత్తంమీద శ్రేయస్ అయ్యర్ 46బంతుల్లో 4ఫోర్లుసాయంతో 29పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 62బంతుల్లో 4ఫోర్లు, ఓ సిక్స్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 5వికెట్లుతో ఆకట్టుకోగా 2వికెట్లు పడగొట్టాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News