Thursday, March 28, 2024

నేటి నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు

- Advertisement -
- Advertisement -

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. బుధవారం చిట్టగాంగ్ వేదికగా మొదటి టెస్టుకు తెరలేవనుంది. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే భారత్ ఈ టెస్టులో బరిలోకి దిగుతోంది. ఇక కెఎల్ రాహుల్ టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. ఇక బంగ్లాదేశ్ టీమ్‌కు షకిబ్ అల్ హసన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సొంత గడ్డపై ఆడుతుండడం బంగ్లాదేశ్‌కు సానుకూల పరిణామంగా చెప్పొచ్చు.

అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని విజయం సాధించే సత్తా టీమిండియా సొంతం. విరాట్ కోహ్లి, పుజారా, రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విన్, సైనీ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఆతిథ్య బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఎంత పెద్ద జట్టునైనా ఓడించే సత్తా బంగ్లాకు ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

అందరి కళ్లు కోహ్లిపైనే

ఇక ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపైనే నిలిచాయి. చివరి వన్డేలో అద్భుత సెంచరీ సాధించడం ద్వారా కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడు. రోహిత్ శర్మ జట్టుకు దూరమైన సమయంలో కోహ్లి బాధ్యత మరింత పెరిగింది. యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ కెప్టెన్‌గా ఉన్నా కోహ్లిదే జట్టు కూర్పులో ముఖ్య భూమిక ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అపార అనుభవజ్ఞుడైన కోహ్లిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న వైస్ కెప్టెన్ చటేశ్వర్ పుజారా కూడా జట్టుకు చాలా కీలకంగా మారాడు. బ్యాటింగ్‌లో జట్టుకు ప్రధాన అస్త్రం పుజారానే అని చెప్పాలి. అతని మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిస్తేనే భారత్‌కు భారీ స్కోరు సాధ్యమవుతోంది. అయితే చాలా కాలంగా టీమిండియా టెస్టు సిరీస్‌లు ఆడడం లేదు. ఇతర బ్యాట్స్‌మెన్‌లు పొట్టి ఫార్మాట్‌లో ఆడినా పుజారాకు అలాంటి ఛాన్స్ రాలేదు. దీంతో బంగ్లాదేశ్ సిరీస్‌లో అతను ఎలా రాణిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఓపెనర్‌గా గిల్!

కాగా, ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కెఎల్ రాహుల్‌తో అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న గిల్‌కు ఈ సిరీస్ మంచి ఛాన్స్‌గా చెప్పొచ్చు. ఇందులో రాణిస్తే తర్వాతి సిరీస్‌లలో కూడా ఛాన్స్ దక్కడం ఖాయం. ఇక కెప్టెన్ రాహుల్‌కు కూడా ఈ సిరీస్ చాలా కీలకం. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. అతను ఎలా రాణిస్తాడనే దానిపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లకు తుది జట్టులో స్థానం ఖాయమనే చెప్పాలి. అంతేగాక సిరాజ్, సైనీ, ఉమేశ్ యాదవ్‌లు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒకవేళ శార్దూల్ ఆడించాలని భావిస్తే సైని, సిరాజ్‌లలో ఒకరు పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు.

తక్కువ అంచనా వేయలం

మరోవైపు ఆతిథ్య బంగ్లాదేశ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. సొంత గడ్డపై బంగ్లాదేశ్ ఎప్పుడైనా ప్రమాదకర జట్టే. ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా టీమిడియా తగిన ఫలితం అనుభవించక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. నజ్ముల్ హుస్సేన్, హసన్ జాయ్, మోమినుల హక్, అనముల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికుర్ రహీం, మెహదీ హసన్, షరిఫుల్ ఇస్లామ్, యాసిర్ అలీ తదితరులతో బంగ్లాదేశ్ బలంగా కనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News