ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు లో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా అదరగొట్టింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సర్కిల్ 2025-27లో భాగంగా శుక్రవారం హెడింగ్లీలోని లీడ్స్ మైదానంలో భారత్, ఇంగ్లం డ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికె ట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అజేయ శతకం సాధించగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
శుభారంభం..
అంతకుముందు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్లు శుభారంభం అందించారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్ను కుదుట పరిచేందుకు ప్రయత్నించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే 78 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేసిన రాహుల్ను బ్రైడన్ కార్స్ వెనక్కి పంపాడు. దీంతో 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ కూడా ఔటయ్యాడు. కెరీర్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన సాయి సుదర్శన్ 4 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఆరంగేట్రం మ్యాచ్లో డకౌట్ అయి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
యశస్వి జోరు..
ఈ దశలో ఇన్నింగ్స్ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ శుభ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. ఇద్దరు పోటీ పడి ఫోర్లు కొడుతూ స్కోరును పరిగెత్తించారు. ఈ జంటను విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గిల్, యశస్విలు అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇదే క్రమంలో మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్తో 101 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.
గిల్, పంత్ హవా..
తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్తో కలిసి శుభ్మన్ మరో కీలక పార్ట్నర్షిప్ను నమోదు చేశాడు. ఇటు పంత్ అటు గిల్లు అద్భుత బ్యాటింగ్తో స్కోరును పరిగెత్తించారు. గిల్ తన మార్క్ బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతన్ని ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గిల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 175 బంతుల్లో16 ఫోర్లు, సిక్సర్తో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అద్భుత బ్యాటింగ్తో అలరించిన రిషబ్ పంత్ 102 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 65 పరుగులు చేశాడు. ఇదే సమయంలో ఇద్దరు నాలుగో వికెట్కు అభేద్యంగా 138 పరుగులు జోడించారు.