దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ఇండియా, ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలను రాష్ట్రం నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. రాష్ట్ర విత్తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మంత్రి వివరించారు. వెయ్యికి పైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలతో పాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్ గుర్తింపు లభించిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా (పంటలకు పెట్టుబడి మద్దతు) విధానాన్ని వివరించారు.
రైతుల ఖాతాలో నేరుగా సబ్సిడీ జమ చేయడం ద్వారా, రైతు తనకు నచ్చిన నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ విధానంతో పారదర్శకత పెరిగి, రైతును శక్తివంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఆఫ్రికా దేశాలు ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని మంత్రి సూచించారు. ఈ సమ్మిట్ భారత్,- ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తోందని ఆకాంక్షించారు. ఈ సమ్మిట్ కేవలం వాణిజ్యంపై కాకుండా, సీడ్ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిరమైన వ్యవసాయం నకు భవిష్యత్తులో పరస్పరం కలిసి పనిచేయడం కోసం ఒక వారధిగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. భారతదేశం గ్రీన్ రివల్యూషన్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించిందన్నారు.
Also Read: ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు