Sunday, April 28, 2024

ఉసురు తీసిన ఒక్క నిమిషం నిబంధన!

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించని ప్రభుత్వ నిబంధన ఒక విద్యార్థి బలన్మరణానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా , జైనాథ్ మండలం, మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ (19) అనే ఇంటర్ విద్యార్థి బుధవారం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పరీక్ష రాయడానికి మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అయితే, అధికారులు పరీక్ష కేంద్రంలోకి అతనిని అనుమతించలేదు. దీంతో మనస్థాపానికి గురైన శివకుమార్ సాత్నాల ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలంలోనే సూసైడ్ నోట్, విద్యార్థి చేతి గడియారం, పెన్ను లభించాయి.

తండ్రికి రాసిన సూసైడ్ నోట్ పలువురిని కంటతడి పెట్టించింది. ‘నాన్నా.. నన్ను క్షమించండి … మీరు నా కోసం ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. కానీ నేను మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయాను. జీవితంలో ఇంతటి బాధతను ఎప్పుడూ చూడలేదు. నన్ను క్షమించండి నాన్న’ అంటూ సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, మూడు నిమిషాలు పరీక్ష కేంద్రానికి వెళ్లడంతో లోపలికి అనుమతించని అధికారులే విద్యార్థి మృతికి కారకులని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News