Friday, May 30, 2025

ఇవాళ పంజాబ్-బెంగళూరు మధ్య కీలక పోరు.. ఫైనల్ చేరేదెవరో?

- Advertisement -
- Advertisement -

ల్లాన్పూర్: ఐపిఎల్ సీజన్ 2025లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫ యర్ 1లో భాగంగా గురువారం సాయంత్రం 7.30 పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆసక్తిక పోరు జరగనుంది. పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా జరుగనున్న ఈ పోరుకు ఇరు జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలిచే టీమ్ ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిన టీమ్ కు మరో ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ విజేతతో ఓడిన జట్టు క్వాలిఫయర్ 2లో తలపడుతుంది. కాగా, ముంబై  ఇండియన్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్, లక్నోతో జరిగిన ఆఖరి లీగ్ పోటీలో బెంగళూరు అద్భుత విజయం సాధించాయి. ఇదే జోరును ఈ పోరులో కొనసాగించాలనే పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి. ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు కొదవలేదు. దీంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

జోరుమీదున్న కింగ్స్..
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ అసాధారణ ఆటతో అలరిస్తోంది. అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్ ఏకంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ 9 మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. తొలి మ్యాచ్ నుంచే పంజాబ్ అద్భుత ఆటతో ఆకట్టుకుంటోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును
ముందుండి నడిపిస్తున్నాడు. సహచరుల్లో ఉత్సా హాన్ని నింపుతూ శ్రేయస్ జట్టును నడిపిస్తున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. తొలి క్వాలిఫ యర్ కూడా జట్టును విజయపథంలో నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఓపెనర్లు ప్రియాం ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్లు ఫామ్ లో ఉండడం పంజాబ్ కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేసే సత్తా ఉన్న వీరిద్దరూ ఈ మ్యాచ్ లోనూ చెలరేగాలనే లక్ష్యంతో కనిపిస్తున్నారు. వీరు మరోసారి విజృంభిస్తే పంజాబ్ కు భారీ స్కోరు ఖాయం. జోష్ ఇంగ్లిస్, నెహాల్ వధెరా, శశాంక్ సింగ్, మార్కొస్ స్టోయినిస్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా పంజాబ్ కు భారీ స్కోరు సాధించడం కష్టమేమీ కాదు. ఇక అర్షదీప్, యజువేంద్ర చాహల్, హర్ ప్రీత్ బ్రార్, స్టోయినిస్ తో బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.

విజయమే లక్ష్యంగా..
ఇక కిందటి మ్యాచ్లో లక్నోను చిత్తుగా ఓడిం చిన బెంగళూరు ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లిలు అద్భుత ఫామ్ లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. కోహ్లి ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. పంజాబ్ పై కూడా జోరును కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాడు. సాల్ట్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ రజత్ పటిదా ర్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, షెఫర్డ్, టిమ్ డేవిడ్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్లో విధ్వంసక ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించిన జితేశ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. భువనేశ్వర్, కృనాల్, యశ్ దయాల్, హాజిల్వుడ్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో బెంగళూరు కూడా విజయం
సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి, ఈ రెండు జట్లలో ఏది ఫైనల్ కు వెళ్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News