అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో భాగంగా ఆదివారం జరిగే క్వాలిఫయర్ 2 సమరానికి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు మంగళవారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుండి. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఎలిమినేటర్ పోరులో అద్భుత విజయం సాధించిన ముంబై.. ఈ మ్యాచ్ కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్ 1లో ఘోర పరాజయం పాలైన పంజాబ్ కు ఈ పోరు సవాల్ గా మారింది. ముంబై వంటి బలమైన జట్టును ఓడించాలంటే పంజాబ్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. ముంబై మాత్రం కీలకమైన ఈ మ్యాచ్ గెలిచి టైటిల్ పోరుకు చేరుకోవాలని తహతహలాడుతోంది.
పటిష్టంగా ముంబయి..
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ముంబై ఈ మ్యాచ్లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ ఫామ్ లో ఉండడం ముంబైకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. గుజరాత్ తో జరిగిన పోరులో రోహిత్ అసాధారణ బ్యాటింగ్ ను కనబరిచాడు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్ తో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేసే సత్తా కలిగిన రోహిత్ చెలరేగితే పంజాబ్ బౌలర్లకు కష్టాలు తప్పవు. మరోవైపు బెయిర్ స్టో కూడా ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు. గుజరాత్ పై మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ రూపంలో మరో పదునైన అస్త్రం ముంబైకి ఉండనే ఉంది. ఈ సీజన్ లో సూర్యకుమార్ అత్యంత నిలకడైన బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు. ముంబై విజయాల్లో అతనిదే కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కిందటి మ్యాచ్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్య, నమన్ తదితరులతో ముంబై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, బౌల్ట్, రిచర్డ్, సాంట్నర్, అశ్వని కుమార్లతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న ముంబై ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
తేలికేం కాదు..
మరోవైపు క్వాలిఫయర్ 1లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన పంజాబ్ కు ఈ మ్యాచ్ సవాల్
వంటిదే. బెంగళూరుతో జరిగిన పోరులో పంజాబ్ 101 పరుగులకే కుప్పకూలింది. కీలక ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. ఈ మ్యాచ్ లో నైనా వీరు సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓపెనర్లు ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్యలు మెరుగైన ఆరంభాన్ని అందించాలి. వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిందంటే ఓపెనర్ల పాత్ర చాలా కీలకమని చెప్పక తప్పదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తన బ్యాట్ కు పని చెప్పక తప్పదు. శ్రేయస్ కెప్టెన్, బ్యాటర్ గా తన పాత్రను సమర్థంగా పోషించాల్సి ఉంది. జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, స్టోయినిస్, నెహాల్ వధెరా, ముషీర్ ఖాన్, అజ్మతుల్లా వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. దీంతో పంజాబ్ కూడా విజయమే లక్ష్యంగా పెట్టుకుంది.