Saturday, July 27, 2024

కాంగ్రెస్‌కు ఐటి దెబ్బ మీద దెబ్బలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి తాజాగా రూ.1,745 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందింది. ఇంతకు ముందు ఇప్పుడు కొత్తగా అందిన ఈ ఐటి నోటీసులతో కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సిన మొత్తం ఆదాయపు పన్నుల మొత్తం (టాక్స్ డిమాండ్) రూ 3567 కోట్లకు చేరుకుంది. అసలుకే కష్టకాలంలో ఉన్న తమకు ఇప్పుడు ఈ తాజా ఐటి నోటీసు కూడా అందిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇప్పుడు అందిన ఐటి నోటీసు 2014 15 నుంచి 201617 అసెస్‌మెంట్ ఇయర్స్ కాలానికి సంబంధించింది. ఓ వైపు తమ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేస్తున్నారని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పార్టీ పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న దశలోనే ఇప్పుడు తాజాగా ఈ ఐటి నోటీసు అందింది. రాజకీయ పార్టీలకు ఐటి విభాగం పన్ను మినహాయింపుల ప్రక్రియను నిలిపివేసింది. ఈ క్రమంలో పార్టీకి మొత్తం వసూళ్లకు సంబంధించి పన్నులు విధించినట్లు తెలిపారు.

ఇప్పుడు కొత్తగా వెలువరించిన నోటీసులో ఏ పన్ను మదింపు సంవత్సరానికి ఎంత మొత్తం ఐటి విధించారనేది గణాంకాలతో వెల్లడించారు. దీని మేరకు కాంగ్రెస్ పార్టీ 201415 సంవత్సరానికి రూ 663 కోట్లు, 201516 సంవత్సరానికి దాదాపుగా రూ 664 కోట్లు, కాగా 201617 సంవత్సరానికి రూ 417 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వెరశి మొత్తం ఈ కాలంలో ఐటి నోటీసు డిమాండ్ విలువ రూ.1745 కోట్లకు చేరగా, ఇప్పటివరకూ ఐటి పన్ను మొత్తం రూ 3567 కోట్లకు పడగలెత్తింది. ఇక కాంగ్రెస్ పార్టీ నేతల నివాసాలలో జరిపిన సోదాల క్రమంలో స్వాధీనపర్చుకున్న పలు డైరీలను నిశితంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డైరీలలో థర్ట్‌పార్టీ ఎంట్రీలు ఉన్నట్లు నిర్థారించారు. దీనితో వీటిపై కూడా పన్నులు వేశారు. కాగా తమకు ఐటి శాఖ నుంచి రూ 1823 కోట్ల టాక్స్ డిమాండ్ జారీ అయిందని, ఈ మేరకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆదాయపు పన్ను శాఖ తమ పార్టీ ఖాతాల నుంచి ఇప్పటికే రూ 135 కోట్లు రాబట్టుకుందని, అంతకు ముందటి చెల్లింపుల పద్దులో వీటిని లాక్కుంటున్నట్లు తెలిపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐటి శాఖ నుంచి నోటీసులు, రూ 135 కోట్ల మేర టాక్స్ డిమాండ్ గురించి పార్టీ కోర్టును ఆశ్రయించింది. సోమవారం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ విషయంలో ఐటి అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో ఎటువంటి ఉపశమనం దక్కకపోవడంతో కాంగ్రెస్ వర్గాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పన్నుల విషయంలో ఐటి శాఖ కాంగ్రెస్ పట్ల దుర్నీతిని, బిజెపి పట్ల ప్రీతిని కనబరుస్తోందని పార్టీ నేతలు దుయ్యబట్టారు. బిజెపి నేతల డైరీలలో కూడా మూడో పక్షం పేర్లతో ఎంట్రీలు ఉన్నాయి. భారీ చెల్లింపులు జరిగాయి. మరి వాటిపై ఎటువంటి పన్నులు వేయలేదు. పలు విధాలుగా ఐటి శాఖ పన్నుల జబర్దస్తీకి దిగుతోంది.

కేంద్రం చేతిలో కొరడాలాగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల పార్టీలపై జులుం చేస్తోందని విమర్శించారు. ఇప్పటి లోక్‌సభ ఎన్నికల కీలక దశలో ప్రధాన ప్రతిపక్షం ఆయువుపట్టు అయిన ఆర్థిక స్థితిని దెబ్బతీసేందుకు పనిగట్టుకుని ఐటి ద్వారా పావులు కదిపారని విమర్శించారు. ఈ విధంగా ఈ ఎన్నికలలో ఐటి పూర్తి స్థాయిలో అధికారపక్షం వైపు మొగ్గుచూపడం జరుగుతోంది. తాము ఇప్పటి విషయాల గురించి ఇటు సుప్రీంకోర్టుకు, అటు ఎన్నికల సంఘానికి కూడా తెలియచేసుకున్నామని, అధికార ఐటి విభాగం సమతూకత పాటించేలా ఆదేశాలు వెలువరించాలని కోరామని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News