Wednesday, July 23, 2025

ధన్‌ఖడ్ రాజీనామాకు కారణాలు అవేనా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతిగా ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నప్పటికీ, విపక్షాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికార కూటమి నేతలు మౌనం వహించగా, ప్రధాని సహా పలువురు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఈ క్రమం లోనే ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలగడంపై పలు విశ్లేషణలు తెరమీదకు వచ్చాయి.

నీతీశ్ కుమార్ కోసమే..?
బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నీతీశ్ కుమార్‌ను తదుపరి ఉపరాష్ట్రపతిగా చేయాలన్న ఉద్దేశం తోనే ధన్‌ఖడ్ రాజీనామా చేశారనే చర్చ నడుస్తోంది. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. నీతీశ్ ఉపరాష్ట్రపతి కావడంలో తప్పేంటని బీహార్‌మంత్రి నీరజ్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. నీతీశ్ ఆ పదవిలో ఉంటే రాష్ట్రానికి ఎంతో మంచిదని, అందరూ అదే కోరుకుంటున్నారని మరో బీజేపీ ఎమ్‌ఎల్‌ఏ హరిభూషన్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం అదే రాష్ట్రానికి చెందిన జీడీయూ నేత హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. మరోవైపు నీతీశ్‌కు ఉపరాష్ట్రపతి కావాలని ఉందనే విషయంపై గతం లోనూ ఊహాగానాలు వచ్చాయి. ఇదే విషయంపై అనేక మంది ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని బీజేపీ మాజీ ఎంపీ దివంగత నేత సుశీల్ కుమార్ 2022లో పేర్కొన్నారు.

అవమానంగా భావించారా?
వర్షాకాల సమావేశాల తొలిరోజు జరిగిన పరిణామాలు కూడా ధన్‌ఖడ్ రాజీనామా వెనక కారణాలనే వాదన ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోరుతూ 68 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసు తనకు అందిందని, దాన్ని అంగీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించడం, అధికారపార్టీకి మింగుడుపడని విషయంగా మారినట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి లోక్‌సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెడుతున్న సమయం లోనే రాజ్యసభ ఛైర్మన్ దీన్ని అంగీకరించడం తొందరపాటు చర్యగా అధికార పార్టీ భావించిందనే వాదన ఉంది. సోమవారం సాయంత్రం నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాకపోవడం ధన్‌ఖడ్‌కు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. దీంతో రాజ్యసభ ఛైర్మన్ సభను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఇలా సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన పరిణామాల పైనా తాజాగా చర్చ నడుస్తోంది. ఈ అంశాలను కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి.

న్యాయవ్యవస్థ పైనా వ్యాఖ్యలు
వృత్తిరీత్యా న్యాయవాది అయిన ధన్‌ఖడ్ ఇటీవల న్యాయవ్యవస్థ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లును సుప్రీం కోర్టు రద్దు చేయడాన్ని రాజ్యసభ ఛైర్మన్‌గా తన తొలి ప్రసంగం లోనే తీవ్రంగా ఆక్షేపించారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలల గడువు లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన తీర్పుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News