న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై భారతదేశ పోరు పంథాకు జపాన్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. సోమవారం ఇక్కడ జపాన్ రక్షణ మంత్రి జెన్ నకతనితో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపారు. ఆయన భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆయన గౌరవార్థం రక్షణ మంత్ర విందు ఇచ్చారు.ఈ దశలో ఇటీవలి పహల్గాం ఉగ్రదాడి, భారత్ తీసుకుంటున్న ఉగ్ర నిరోధక చర్యల గురించి జపాన్ రక్షణ మంత్రికి తెలియచేశారు. ఉగ్రవాద బెడద నిర్మూలనలో అందరి సమన్వయం అవసరం అని, ఇప్పటి పరిస్థితి తీవ్రత నేపథ్యంలో తమ దేశం భారత్కు పూర్తిగా సహకరిస్తుందని జెన్ హామీ ఇచ్చారు. ముందుగా ఇరు దేశాల ఉన్నతాధికారుల స్థాయి సంప్రదింపులు జరిగాయి. తరువాత ఇద్దరు రక్షణ మంత్రుల ముఖాముఖి భేటీ సాగింది.
ఈ సందర్భంగా అనేక ద్వైపాక్షిక విషయాలు, అంతర్జాతీయ సంక్షోభాలు, చైనా ఇప్పుడు ఇండో పసిఫిక్లో నిర్వహిస్తోన్న సైనిక విన్యాసాలు, దీనితో నెలకొంటున్న ఉద్రిక్తతల గురించి ఇరువురు నేతలు సమీక్షించారని అధికారులు ఆ తరువాత తెలిపారు. జపాన్ తమకు అత్యంత కీలకమైన గ్లోబల్ భాగస్వామ్యపక్షం అని , ఈ బంధంలో అనేక ప్రత్యేకతలు అంతకు మించిన వ్యూహాత్మక విషయాలు ఇమిడి ఉన్నాయని సమావేశం తరువాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విలేకరులకు తెలిపారు. ఇటు భారతదేశం పాకిస్థాన్తో పలు విధాలుగా ఉగ్రవాద చర్యల బెడదను ఎదుర్కొంటోంది. మరో వైపు జపాన్ను ఇతర దేశాలను చైనా తన సైనిక పాటవ ప్రదర్శనలతో భయపెడుతోంది. ఈ దశలో జపాన్ భారత్ రక్షణ మంత్రుల అత్యున్నత స్థాయి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.