Tuesday, April 30, 2024

కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు రూట్ క్లియర్ అయింది. కాంగ్రెస్‌లో పొంగులేటి, జూపల్లి కృష్ణారావుల చేరికకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించి వారి వారి క్యాడర్‌కు సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20న లేదా 25న పొంగులేటి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభలో ఇరువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. అయితే ఖమ్మం సభకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక, బిఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారనే చర్చ గత కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వీరితో బిజెపి నేతలు చర్చలు జరిపారు. బిజెపి చేరికల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఈటల రాజేందర్ మరికొందరు పార్టీ నేతలతో కలిసి ఖమ్మం వెళ్లి పొంగులేటి, జూపల్లితో భేటీ అయ్యారు. ఇరువురు నేతలను బిజెపిలోకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత కూడా వారితో చర్చలు సాగించారు. కానీ ఈటల ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు కాంగ్రెస్ కూడా తెరవెనక పొంగులేటి, జూపల్లిలతో చర్చలు జరుపుతోంది. కానీ ఏ పార్టీ చేరతారనే విషయంపై ఇరువురు నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగింది. పార్టీలో చేరికకు సంబంధించి కొన్ని డిమాండ్లను కూడా పెట్టారనే వార్తలు వచ్చాయి.

అయితే ఆ ప్రచారంపై పొంగులేటి, జూపల్లి స్పందించలేదు. తాజా సమాచారం ప్రకారం వారు కాంగ్రెస్ చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక, ఇదిలా ఉంటే.. ఈ నెల 9 లేదా 10 తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ నేతలకు రాహుల్ గాంధీ, ప్రియంకలు దిశానిర్ధేశం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News