Sunday, April 28, 2024

చోరీకి వచ్చి వంటింట్లో నిద్రపోయిన దొంగ

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: ఆకలి రుచి ఎరగదు..నిద్ర సుఖమెరగదు అని అంటారు పెద్దలు. ఆకలితో ఉన్నవాడికి చద్దన్నమైనా పంచభక్ష పరమాన్నంలా ఉంటుంది. ఇక నిద్రాదేవత ఆవహిస్తే కటిక నేలకు కుషన్ పరుపు తేడా తెలియదు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక దొంగ కూడా ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకున్నాడు. దొంగతనానికి వచ్చిన వాడు ఇంట్లో విలువైన వస్తువులు తీసుకుని పారిపోకుండా నిద్ర ముంచుకొచ్చిందని వంటింట్లో నిద్రపోయి నేరుగా కృష్ణ జన్మస్థానానికి చేరుకున్నాడు. కాన్పూర్‌లోని నంబస్తా ప్రాంతంలోని కృష్ణ విహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంద్ర కుమార్ తివారీ అనే ఇంటి యజమాని ఇటీవల మరణించిన తన భార్యకు శ్రాద్ధకర్మలు పెట్టేందుకు ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలసి సొంత ఊరికి వెళ్లాడు. ఇంతలో పక్కింటి వ్యక్తి నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. మీ ఇంట్లో దొంగలు పడ్డారని, ఇల్లంతా దోచుకున్నారని, అయితే ఒక అపరిచిత వ్యక్తి మాత్రం వంటింట్లో నిద్రపోతున్నాడని ఆయన చెప్పడంతో తివారీ కంగారు పడ్డాడు. వెంటనే తన ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో రూ. 1.5 లోల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని ఆయన గుర్తించాడు. వంటింట్లో నిద్రపోతున్న వ్యక్తిని చూసి వెంటనే పోలీసులకు కబురు చేశాడు.

అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ అపరిచిత వ్యక్తిని నిద్రలేపి పోలీసు స్టేషన్‌కు తీసుకెళారు. తన పేరు దీపక్ శుక్లా అని చెప్పిన ఆ వ్యక్తి పెయింటింగ్ పనులు చేసుకునే తాను తాను పనిచేసిన ఇళ్లలో చోరీలు చేస్తుంటానని ఇంటరాగేషన్‌లో బయటపెట్టాడు. తాను, తన ఇద్దరు సహచరులతో కలసి తివారీ ఇల్లును దోచుకున్నామని, అయితే మద్యం మత్తులో ఉన్న తాను వంటింటో తెలియకుండానే నిద్రపోయానని, తన సహచరులు తనను వదిలిపెట్టి పారిపోయారని అతను చెప్పాడు. శుక్లాతోపాటు చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఉత్కర్ష్ అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News