Friday, April 26, 2024

5 వాగ్దానాల అమలుకు కర్నాటక క్యాబినెట్ పచ్చజెండా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎటువంటి కుల, మత వివక్ష లేకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయాలని కర్నాటక క్యాబినెట్ శుక్రవారం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.

కర్నాటక మంత్రివర్గం శుక్రవారం సమావేశమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన ఐదు వాగ్దానాల అమలుపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గృహ వినియోగదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్(గృ జ్యోతి), ప్రతి కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 2,000 ఆర్థిక సాయం(గృహ లక్ష్మి), బిపిఎల్ కుటుంబంలోని ప్రతి సభ్యుడికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం(అన్న భాగ్య), 1825 మధ్యవయస్కులైన ప్రతి నిరుద్యోగ గ్రాడ్యుయేట్, డిప్లొమా హోల్డర్‌కు నెలకు రూ. 1,500 చొప్పున నిరుద్యోగ భృతి(యువ నిధి), ప్రజా రవాణా బస్సులలో మహిళలందరికీ ఉచిత ప్రయాణం(శక్తి) వంటి ఐదు పథకాలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఐదు వాగ్దానాలు చేసింది.

గృహజ్యోతి పథకాన్ని జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు సిద్దరామయ్య తెలిపారు. అయితే బకాయిలను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. గృహ లక్ష్మి పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయాన్ని అందచేసే ఈ పథకం వర్తించాలంటే మహిళలు జూన్ 15 నుంచి జులై 15 లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో కాని నేరుగా కాని సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
అన్న భాగ్య కింద ప్రతి బిపిఎల్ కుటుంబ సభ్యుడికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం అందచేసే
పథకం జులై 1 నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.

ప్రజా రవాణా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం జూన్ 1 నుంచి అమలులోకి వచ్చిందని, అయితే కర్నాటకలో ఎసి, లగ్జరీ బస్సులలో మాత్రం ఈ పథకం వర్తించదని ఆయన చెప్పారు. కెఎస్‌ఆర్‌టిసి బస్సులలో పురుషులకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని, మిగిలిన సీట్లు మహిళలకు లభిస్తాయని సిఎం తెలిపారు.

యువనిధి పథకం కింద 2022-23లో పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ. 1,500 చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్న నాటి నుంచి 24 నెలలపాటు నిరుద్యోగ భృతి అందచేయాలని నిర్ణయించినట్లు సిద్దరామయ్య తెలిపారు. ఈ మధ్యలో వారికి ఉద్యోగం లభించిన పక్షంలో నిరుద్యోగ భృతి నిలిచిపోతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News