Wednesday, April 17, 2024

దశాబ్ది దద్దరిల్లాలె

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వజ్రపు తునక
స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం
రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం
ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు
95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం
నేను చెప్పినట్టు ఎంఎల్‌ఎలందరూ పనిచేస్తే ప్రతీ ఒక్కరికీ 50వేల కన్నా అధిక మెజారిటీ వస్తుంది
ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది…? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు
వివరించాల్సిన బాధ్యత అందరిమీద ఉన్నది
మూడు వారాలపాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు దద్దరిల్లాలె
ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉండాలి
ఎంఎల్‌సిలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న సేవలను విరివిగా వాడుకోవాలి
గుజరాత్ మోడల్ బోగస్.. మోదీ భారతదేశాన్ని మోసం చేసిండు
ఇప్పుడు దేశానికి తెలంగాణ మోడల్ అనివార్యమని ఇతర రాష్ట్రాల వాళ్లు చెప్తున్నారు
బిఆర్‌ఎస్ విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: వజ్రతునక తెలంగాణ… స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం…ఈ సందర్భంలో జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుందామని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది…? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించాల్సిన బాధ్యత అందరిమీదా ఉన్నదని సిఎం తెలిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎంఎల్‌ఎలు, ఎంపిలు, జెడ్‌పి చైర్మన్లు.. ఇలా అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పండుగ వాతావరణంలో నిర్వహించాలని కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌ఎలు, బిఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జెడ్‌పి చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు సహా పలువురు ముఖ్యనాయకులతో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు వచ్చిన ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు. అనతికాలంలోనే తెలంగాణ దేశానికి ఎలా రోల్ మోడల్ అయిందో ఆయన తనదైన శైలిలో ఆవిష్కరించారు.

మళ్లీ అధికారం మనదే
రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం… ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, మనం కచ్చితంగా 95 ఉంచి 105 స్థానాలు గెలబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పినట్టు ఎంఎల్‌ఎలందరూ పనిచేస్తే కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ 50వేల కన్నా అధిక మెజారిటీ వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. పదేండ్ల కాలంలో మనం అద్భుతమైన ప్రగతిని సాధించాం కాబట్టే ఇవ్వాళ తెలంగాణ మోడల్‌ను దేశం కోరుకుంటుంది అని సిఎం తెలిపారు. సూర్యాపేటలో, కామారెడ్డిలో లేదా మరో తెలంగాణ ప్రాంతంలో సభలు పెట్టుకుంటే వేలాది మంది మనప్రజలు రావడం సహజం కానీ, మహారాష్ట్రలోనూ అదే తరహాలో ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి బలమైన కారణం మనం ఆచరించి చూపిన మోడల్ అని పేర్కొన్నారు. దీన్ని మనం బాగా చెప్పుకోవాలని సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

దేదీప్యమానంగా దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు సిఎం కెసిఆన్ సూచలు చేశారు. మహారాష్ట్ర తెలంగాణను చూసి ఆశ్చర్యపడుతున్నదని పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో ఒక ఐఎఎస్ ఆఫీసరే తెలంగాణ మోడలే శరణ్యమని బహిరంగ ప్రకటన చేశారని తెలిపారు. మనం మనం చేసిన పనులను చెప్పుకోవటం లేదని అన్నారు. దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించుకోవాలని ఎంఎల్‌ఎలు, ఎంపిలు సహ అన్ని స్థాయిల ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రైతు వేదికలు అపూర్వమైన వేదికలని, వాటి గొప్పతనాన్ని చాటిచెప్పాలని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేనన్ని గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామని, తాను సిద్దిపేట ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు ఒక రెసిడెన్షియల్ కాలేజీ కోసం వందల సార్లు తిరిగినా కాలేజీ రాకపోయేదని గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా 1,001 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామని, ఇది మన ఘనత అని వ్యాఖ్యానించారు. దీన్ని మనం చెప్పుకోవాలి కదా అని అన్నారు.

ఎంఎల్‌ఎలు పిల్లల కోడి లెక్క ఉండాలె
ఎంఎల్‌ఎలు పిల్లల కోడి లెక్క ఉండాలని… అందరినీ కాపాడుకోవాలని సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేశారు. కులం…మతం మీద ఏ పార్టీ గెలువదని, అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తున్నామని అదే మన విజయ రసహ్యమని వ్యాఖ్యానించారు. ఇస్యూబేస్డ్ పోవాలె కానీ… చిల్లరమల్లర విషయాల మీద కాదని అన్నారు. అంశాల వారీగా రాజకీయాలు చేయాలని, కుత్సిత మనసుతో రాజకీయాలు చేయకూడదని చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని ఉద్యమ సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు. నూటికి నూరుపాళ్లు ధనిక రాష్ట్రంగా అవతరించినమని తెలిపారు. రాష్ట్రంలో 3,400 గిరిజన తండాలు, గోండుగూడెలాను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని.. ఇది చరిత్ర అని పేర్కొన్నారు. వెయ్యి గొంతుకలతో మనం చేసిన పనిని చెప్పుకోవాలని పిలుపునిచ్చారు.

సిట్టింగ్‌లకే సీట్లు
వచ్చే ఎన్నికల్లో మాగ్జిమం సిట్టింగ్ ఎంఎల్‌ఎలకే సీట్లు ఇవ్వనున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. మనం కచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నామని, ఇందులో ఎవరికీ అనుమానాలు, అపోహలు అక్కరలేదని చెప్పారు. తాను చెప్పినట్టు చేస్తే 50వేల మెజారిటీ గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. ప్రజలను మంచిగ చూసుకోవాలె… మన శక్తిని ఏకీకృతం చేసుకోవాలె అని పేర్కొన్నారు. ఎంపిలు, ఎంఎల్‌సిలు, జెడ్‌పి చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఇలా అందరితో ఎంఎల్‌ఎలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలె అని దిశానిర్ధేశం చేశారు.ప్రతీది కీన్‌గా వాచ్ చేస్తున్నా అని చెప్పారు.

మిషన్ కాకతీయ అనే మంత్రం అద్భుతంగా పనిచేసింది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వజ్రపు తునక అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇవ్వాళ ఎపి పరిస్థితి ఏంది…? .తెలంగాణలో ఇప్పటికే 56 లక్షల 44వేల ఎకరాల నాట్లు పడ్డాయి… మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు అద్భుతంగా పెరిగాయని చెప్పారు. భూగర్భ జలాలు పైకి రావటానికి మనం ఏమైనా మంత్రం వేసినమా…? మిషన్ కాకతీయ అనే మంత్రం అద్భుతంగా పనిచేసిందని చెప్పారు. గొలుసుకట్టు చెరువులను బాగు చేసుకున్నాం… ఒక్కో గొలుసుకట్టు చెరువు 27 నుంచి 28 చెరువుల కింద రైతులకు బువ్వపెట్టిందని తెలిపారు.

మిషన్ కాకతీయ లేనప్పుడు భూగర్భ జలం నిలువ ఎంత..? ఇప్పుడెంతా వచ్చిందో అర్ధం అయ్యేలా వివరంగా చెప్పాలని దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల బోర్లకు కొదవలేని నీరుందని, ఊరూరా చెరువుల పండుగ చేయాలని పిలుపునిచ్చారు. నడి ఎండాకాలంలో చెరువులు, చెక్‌డ్యాములు మత్తడి దుంకుతున్నయని అన్నారు. రైతుల మోటర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం కోరినా పెట్టలేదని, మనకు రూ. 25వేల కోట్ల నష్టం వచ్చినా రైతుల కోసం మనం నిలబడాలి అనుకున్నమని ఉద్ఘాటించారు. వద్దంటే వద్దని పెట్టుకోలే… అది రైతుల పట్ల మనకు ఉన్న కమిట్‌మెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మనం చెప్పుకోవటం లేదని అన్నారు.

దశాబ్ది ఉత్సవాలు దద్దరిల్లాలె
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలని.. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. సింగరేణి తెలంగాణ కొంగుబంగారం…. పదేండ్లకింద రూ. 12వేల టర్నోవర్ ఉంటే ఇప్పుడు రూ. 33 నుంచి 34వేల కోట్లకు చేరిందని చెప్పారు. ఈ విజయాన్ని సింగరేణి ప్రాంత ఎంఎల్‌ఎలు చెప్పాలని దిశానిర్ధేశం చేశారు. సింగరేణిని మొత్తం మనమే తీసుకుంటం అంటే మోదీ ఇస్తలేడని పేర్కొన్నారు. సమైక్య పాలకుల తెలివి తక్కువ తనంతో సింగరేణికి లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 10 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మైనింగ్ ద్వారా కేవలం రూ. 36 కోట్లు వస్తే మన ప్రభుత్వం కేవలం 5 ఏండ్ల కాలంలోనే రూ. 5,600 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఘనతను చెప్పుకోవాలని చెప్పారు.

దేశంలో గుణాత్మక మార్పు రావాలె
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అందుకోసమే మనం బయలుదేరినమని కెసిఆర్ చెప్పారు. నెహ్రూ జమానాలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి కొంతలో కొంత చేసిండు అని పేర్కొన్నారు. ఆ తరువాత ఎవరూ ప్రణాళికా బద్దంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆశించలేదని చెప్పారు. గుజరాత్ మోడల్ బోగస్ అని విమర్శించారు. మోదీ భారతదేశాన్ని మోసం చేసిండు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశానికి తెలంగాణ మోడల్ అనివార్యమని ఇతర రాష్ట్రాల వాళ్లు చెప్తున్నారని, ఈ ఘనత మనందరిదని వ్యాఖ్యానించారు.

మన బాసులు తెలంగాణ ప్రజలే
మన బాసులు తెలంగాణ ప్రజలే…వాళ్లే మనకు భగవద్గీత..వేదం అన్నీ తెలంగాణ ప్రజలే అని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతు వేదికలను సరియైన పద్ధతిలో వినియోగించుకోవాలని చెప్పారు. రైతులను పిలిచి భోజనాలు పెట్టాలని, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, జెడ్‌పి చైర్మన్లు …ఇలా అందరూ రైతు వేదికల దగ్గరికి వెళ్లి.. రైతులతో చర్చించాలని దిశానిర్ధేశం చేశారు. దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని మనం చేసినం… కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకున్నామని అన్నారు. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్రం పట్టించుకోకపోయినా మనం కేంద్రం కోసం ఆగలేదని, రెండు మూడు వేల కోట్ల భారమైనా రైతులను ఆదుకుంటామని ప్రకటించామని గుర్తు చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 10వేలు ఇస్తామని చెప్పినం… ఇస్తున్నం అని .. ఇది చరిత్ర అని పేర్కొన్నారు.

దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని పని… దీన్ని మనం చెప్పుకోవాలని తెలిపారు. వడగండ్లవాన, అకాల వర్షాల నుంచి రైతులను శాశ్వతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం రైతులను చైతన్యవంతం చేసే బాధ్యత అందరం తీసుకోవాలని చెప్పారు. సీజన్ అడ్వాన్స్‌మెంట్ చేయాలని, దీనిపై విస్తృతంగా రైతుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చి 31 లోపల వరికోతలు పూర్తి కావాలని పేర్కొన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమంటే మార్చి 31లోపల కోత కోసిన వరి పైరుకు నూక రాదు అని చెప్పారు. కల్తీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్ ఉన్నదనే విషయం చాలా స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. కల్తీలకు పాల్పడితే పీడీ యాక్ట్లు పెడుతున్నామని, రైతులను మోసం చేసిన వారిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు అన్న సంకేతాలు చాలా బలంగా వెళ్లాలని తెలిపారు.

కనివినీ ఎరుగని రీతిలో దశాబ్ది ఉత్సవాలు
దశాబ్ది ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలె…బ్యానర్లు, పోస్టర్లు కట్టాలె అని సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేశారు. కనివినీ ఎరుగని రీతిలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న అన్ని ప్రచార మాధ్యమాల్లో మన చరిత్ర.. విజయగాథలను డాక్యుమెంటరీల రూపంలో ప్రదర్శించాలని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఇలా అన్ని రంగాల్లో మనం సాధించిన ప్రగతిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించాలన్నారు. నియోజకవర్గాల వారీగా మన ప్రగతిని డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి లేక్కలు తీయండి అని చెప్పారు.

మన ప్రాంతంలో ఉన్న వైతాళికులను గుర్తించి, గౌరవించాలి
ఎంఎల్‌సిలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న సేవలను విరివిగా వాడుకోవాలని సిఎం సూచించారు. మంచి మంచి కార్యక్రమాలను పెట్టి వీరిని ఆహ్వానించాలని చెప్పారు. పారదర్శకంగా, అవినీతి రహితంగా జరుగుతున్న పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్ధేశం చేశారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకోవాలని వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆద్యుడు పివి.. ఒక్క పివినే కాదు ఆయన గురువు అయిన నూకల రాంచంద్రారెడ్డి గురించి కూడా చెప్పుకోవాలని అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ప్రాంతంలో ఉన్న వైతాళికులను గుర్తించి… గౌరవించాలని చెప్పారు. భాగ్యరెడ్డివర్మ, బద్దం ఎల్లారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవీ, సురవరం ప్రతాపరెడ్డి ఇలా ఎక్కడిక్కడి వైతాళికులను గుర్తించి వారిని కీర్తించాలని తెలిపారు. ఇట్లాంటి వాళ్లంతా తెలంగాణ ప్రతీకలు అని వ్యాఖ్యానించారు. సంప్రదాయ కళాకారులతో ఊరేగింపు నిర్వహించాలని అన్నారు. కవి సమ్మేళనాలు నిర్వహించాలని, వీటికి ఎంఎల్‌ఎలు నాయకత్వం వహించాలని దిశానిర్ధేశం చేశారు.

దేశపతి మాట.. గోరటి పాట…
దశాబ్దితో శతాబ్ది వైభం తెలంగాణ సొంతం చేసుకున్నదని, దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సువర్ణావకాశంగా తీసుకోవాలని ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్ చెప్పారు. గోరటి వెంకన్న తన పాటతో మారిన తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ ముఖానికి ప్రతిబింబం సిఎం కెసిఆర్ అని తమదైన శైలిలో ఆవిష్కరించారు. ఉత్సవాలను అద్భుతంగా తెలంగాణ జీవకళ ఉట్టిపడేలా నిర్వహించాలని,ఇందుకు ప్రభుత్వంతోపాటు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పూనుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి హోర్డింగ్స్ పెట్టుకోవాలని, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించాలని దేశపతి శ్రీనివాస్ సూచించారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిన ఈ సందర్భంగా విషయాన్ని చెప్పారు.

దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశాం
తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని సిఎం కెసిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు
దేశానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, గత 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు… అందుకే వాళ్ళని ప్రజలు నమ్మరని, మన పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకవుతూ అందరికీ అందుబాటులో ఉండాలని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. కర్ణాటక ఫలితాలను పట్టించుకోవద్దని కేడర్‌కు సూచించాచినట్లు తెలిసింది. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదని, అక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కెసిఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News