Tuesday, June 3, 2025

కాంగ్రెస్‌లో కేసిఆర్ కోవర్టు టిపిసిసి అధ్యక్షుడే : ఆరోపించిన బిజెపి ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కేసిఆర్ కోవర్టు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడేనని బిజెపి ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పవార్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ రావులు విమర్శించారు. ఆయనే బిజెపికి, ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో కేసిఆర్‌కి అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నది మహేష్ కుమార్ గౌడేనని అందరికీ తెల్సిందేనని పేర్కొన్నారు. ఆదివారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌కు చెందిన మహేష్ కుమార్ గౌడ్ 2014 లోకసభ ఎన్నికల్లో అప్పటి బీఆర్‌ఎస్ అభ్యర్ధి కవితకు పరోక్ష మద్దతు ఇచ్చారని తెలిపారు.

ఇదే విషయమై మహేష్ కుమార్ గౌడ్‌పైన అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఓడిపోయిన మధు యాష్కీ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారని సమాచారం ఉందని తెలిపారు. కవితతో ఉన్న ఆ సఖ్యత వల్లనే ఆమెను కాంగ్రెసులోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాలని మహేష్ గౌడ్ వారి పార్టీ హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. బిజెపిలో బీఆర్‌ఎస్ విలీనంపై కసరత్తు జరిగిందంటూ కవిత నిరాధార వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆ అంశంపై బిజెపిని విమర్శించాలంటూ ఇచ్చిన సూచన మేరకు మహేష్ కుమార్ గౌడ్ దరుద్దేశ పూరితంగా ఎంపీ ఈటలను, బిజెపిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఎంపీ ఈటల ఇమేజ్‌ను దెబ్బతీయా కట్టుకధ

తెలంగాణ ఉద్యమనేతగా ఎంపీ ఈటల రాజేందర్‌కి ఉన్న తిరుగులేని ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు మహేష్ కుమార్ గౌడ్ తనదైన కట్టుకధలతో కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్ పేటలో ఓ ఫామ్ హౌజులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో భేటీ అయి, అక్కడి నుంచి మాజీ సీఎం కేసిఆర్‌తో ఫోనులో మాట్లాడినట్టు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. బిజెపికున్న ప్రతిష్టతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఆయన కట్టుకధలు అల్లారని పేర్కొన్నారు. వారిద్దరు శామీర్ పేటలో ఏ ఫామ్ హౌజులో భేటీ అయ్యారో అందుకు సంబంధించిన ఆధారాలేంటో 24 గంటల్లోగా బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు.

లేదంటే అదంతా కట్టుకధే అని అంగీకరించి తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని సవాల్ చేశారు. బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ అభ్యుదయవాదిగా, తెలంగాణ ఉద్యమ నేతగా, మంత్రిగా ప్రజల బాగోగుల కోసం పనిచేసి అన్నివర్గాల మన్ననలు పొందారు. తెలంగాణ సమకాలీన రాజకీయాల్లో అన్ని వర్గాల ఆదరణ పొందిన బీసీ నేతల్లో ఈటల రాజేందర్ కూడా ఒకరని తెలిపారు. ఇమేజ్ ఉన్న లీడరు తమ పార్టీలో లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. ఈటల ఇమేజ్‌ను చూసి ఓర్వలేక టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదే పనిగా ఆయన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రెండో వారంలో కూడా ఇదే మహేష్ కుమార్ గౌడ్ తన అతి తెలివిని ప్రదర్శిస్తూ ఈటల రాజేందర్‌ది ఏ కులం అని మూర్ఖంగా ప్రశ్నించి తెలంగాణ ప్రజల ముందు భంగపడ్డారని తెలిపారు. అయినా మహేష్ కుమార్ గౌడ్ తన రాజకీయ మనుగడ కోసం అదేపనిగా ఈటలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News