Thursday, May 16, 2024

ఫ్రీ బస్సు తప్ప అంతా తుస్సు

- Advertisement -
- Advertisement -
ఆరు గ్యారంటీలూ ఆగమాగం
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం
చూపించింది ఇంటి పార్టీగా
బిఆర్‌ఎస్‌ను ఆదరించండి
నాపై నిషేధమా?
48గంటలు నిషేధం పెడితే
కార్యకర్తలు 96గంటలు
కష్టపడతారు అడ్డగోలుగా
మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై
మౌనమా? ఇదేనా ఇసి
న్యాయం మహబూబాబాద్
రోడ్‌షోలో మాజీ సిఎం,
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్

మనతెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ‘ మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ ను కెసిఆర్ జిల్లాను చేసిండు.. మరి ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి జిల్లాను రద్దు చేస్తామంటుండు..ఏమంటా రు’ అని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబాబాద్ ప్రజలను ప్రశ్నించారు. మానుకోట జిల్లా ఉండాలంటే మాలోత్ కవితను గెలిపించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్‌లో నిర్వహించిన రోడ్ షోలో జనాలకు పిలుపునిచ్చారు.

‘కాంగ్రెస్ గత ఎన్నికల ముందు అర చేతిలో వైకుంఠం చూపించింది. లేనిపోని అమలు కాని ఎన్నో హామీలను గుప్పించి ప్రజలను ఏమార్చి, మోసం చేసి అధికారంలోకి వచ్చింది’ అని ఆరోపించారు. కాంగ్రె స్ ఇచ్చిన హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏదీ నెరవేర్చలేదన్నారు. సంక్షేమ పథకాలు మంచివేనని.. ఉచి త బస్సు ద్వారా ఆటో రిక్షా కార్మికులు రోడ్డున పడ్డారని.. అనేకమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారికి అన్నివిధాలుగా న్యా యంచేయాలని.. వారి సమస్యల కోసం సాగే ఉద్యమాల్లో త మ పార్టీ వెంటనడుస్తుందన్నారు. దగా చేసిన కాం గ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఇచ్చిన హామీలన్నీ కిందపడేస్తారని ఆరోపించారు.

‘రైతులకు రైతుబంధు కెసిఆర్ ఎకరాకు పది వేలే ఇస్తాండు.. మేమైతే రూ.15 వేలు ఇస్తామన్నారు. కానీ ఒక్కరికైనా ఇచ్చారా రూ.15 వేలు అని ప్రశ్నించారు. కొత్తవి రాలేదు.. పాతవి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వడ్లు కొనేనాధుడే లేడని.. క్వింటాలుకు ఐదొందల బోనస్ కూడా బోగస్ అని పేర్కొన్నారు. ఐదు నెలల్లోనే పంటలు నీరు, కరెంటు లేక ఎండిపోయి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ఏమైందని.. మహబూబాబాద్, డోర్నకల్‌లో తాగునీటి కష్టాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారన్నారు. కరెంటు సక్రమంగా సరఫరా కావడం లేదన్నారు. రైతు కూలీలకు నెలకు రూ.1200 ఇస్తామని చెప్పారు ఎక్కడైనా ఇచ్చారా అని నిలదీశారు. ‘ఎలక్షన్ కమిషన్ నా మీద 48 గంటల నిషేధం విధించింది. అడ్డగోలుగా మాట్లాడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిషేధం లేదు’ అని అన్నారు.

ఎలక్షన్ కమిషన్ నిషేధం వల్ల ఎక్కువగా మాట్లాడలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నామీద 48 గంటలు నిషేధం విధిస్తే.. బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు 96 గంటలు కష్టపడి పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మోడీ రూ.15 లక్షలు వస్తాయని చెప్పారు.. ఏ ఒక్కరికైనా వచ్చాయా అని సభికులను ప్రశ్నించారు. గోదావరి నది నీటిని నరేంద్రమోడీ ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి సప్పుడు కూడా చేయడం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా నీటిని కెఆర్‌ఎంబికి అప్పగించారన్నారు. మోడీవి అన్నీ నినాదాలే తప్ప ఏ పథకం అమలు కాలేదని అన్నారు. 45 డిగ్రీల ఎండలో కూడా ఉప్పెనలా ..ఆవేశపూరితంగా తరలివచ్చిన జనాలకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

గిరిజనులకు ఎన్నో చేశాం..
గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు బంజారా భవన్‌ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో నిర్మించుకున్నామని అన్నారు. ‘గిరిజనుల చిరకాల వాంఛ అయిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. పది శాతం రిజర్వేషన్లు అమలు చేసుకున్నాం.. 70 ఏళ్లలో ఈ రాష్ట్రంలో పాలించిన ఏ ప్రభుత్వం ఈ పనులు చేయలేదు’ అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మాత్రమే గిరిజనులకు మేలు చేసిందన్నారు. లంబాడీ బిడ్డలు, మేధావులు, గిరిజనులు, రైతులు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పాలనను బేరీజు వేసుకోవాలని కోరుతున్నానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతాపం చూపించి కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలని కోరారు.

బిఆర్‌ఎస్ పార్టీకి స్వప్రయోజనాలు ఏమీ ఉండవని..అనుక్షణం పార్టీకి తెలంగాణ ప్రజల ప్రగతి, ప్రతి అడుగు, ప్రతి మాట ప్రజల పక్షమే అని అన్నారు. బిఆర్‌ఎస్ ఇంటి పార్టీ అని, ఈ పార్టీని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ ప్రజలపై ఉందన్నారు. గత ఐదేళ్లుగా ఎంపిగా మాలోతు కవిత కష్టపడి పనిచేస్తోందని, పార్లమెంట్‌లో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతోందని అన్నారు. కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని సభకు హాజరైన ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ఈ రోడ్ షోలో పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్ది మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జనగామ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, డిఎస్. రెడ్యానాయక్, మాజీ ఎంఎల్‌ఎలు బానోత్ శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్‌పి చైర్‌పర్సన్ కుమారి బిందు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News