సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఒక పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనున్నదనే వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి కెసిఆర్ సూచించారు. మరణించిన వారి కుటుంబాలకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కార్మికులు చనిపోవడం అత్యంత విషాదకరం- : కెటిఆర్
పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. 10 మంది వరకు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే రక్షించాలని అధికారులను కోరారు. గాయపడిన వారందరికీ ఉత్తమ వైద్య సహాయం అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అన్ని పారిశ్రామిక యూనిట్లకు భద్రతా ఆడిట్లు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలోని భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంతమంది చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు. చనిపోయినవారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కెటిఆర్ ప్రార్థించారు.