Tuesday, April 30, 2024

సిఎం కెసిఆర్ లైబ్రరీలను దేవాలయాలుగా మార్చారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాతే గ్రంథాలయాలకు మహర్దశ వచ్చిందని, సిఎం కెసిఆర్ లైబ్రరీలను దేవాలయాలుగా మార్చారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో మెట్టుగడ్డ జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన 55వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు గ్రంథాలయాలు చక్కని వేదికలుగా మారుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా చక్కని కోచింగ్ అందించేందుకు స్థానిక సిబ్బంది చిక్కడపల్లి లైబ్రరీని సందర్శించాలన్నారు. అక్కడి వసతులపై అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. చిక్కడపల్లిని మించి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇక్కడే లైబ్రరీ కోసం పెద్ద హాల్ నిర్మించి అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో నూతనంగా 6 గ్రంథాలయ భవనాలు నిర్మించామని, రూ. 3 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అడిగిన మేరకు పుస్తకాలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంచామన్నారు. మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, కౌన్సిలర్ తిరుమల రోజా వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, టిఆర్ఎస్ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News