Saturday, July 27, 2024

నేనేమీ రబ్బరు స్టాంప్‌ను కాదు: గవర్నర్ ఆరిఫ్ ఖాన్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: బిల్లులను పరిశీలించకుండా ఆమోదం తెలపడానికి తానేమీ ‘రబ్బర్‌స్టాంప్’కానీ, ఎస్ చెప్పే మనిషిని కానీ కాదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ గురువారం వ్యాఖ్యానించారు. ఏదయినా బిల్లు లేదా, ఆర్డినెన్స్ తన ముందుకు వచ్చినప్పుడు అది రాజ్యాంగరీత్యా , చట్టపరంగా కరెక్టా కాదనే విషయాన్ని తాను పరిశీలిస్తానని ఆయన చెప్పారు. కేరళ ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఏ బిల్లు లేదా ఆర్డినెన్స్ తన టేబుల్‌పైన గంటకూడా ఉండదని కూడా ఆయన చెప్పుకున్నారు. ‘అలాంటి వాటిని వెంటనే సంతకం చేసి పంపిస్తాను. అయితే ప్రభుత్వం వ్యవస్థలను, యూనివర్శిటీలను, వాటి స్వయంప్రతిపత్తిని నాశనం చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించినప్పుడు, అవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను తలూపే మనిషిగా ఉంటానని వాళ్లు అనుకోకూడదు.

ఎందుకంటే నేను రబ్బరు స్టాంప్ కాదు’ అని ఆరిఫ్ ఖాన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దాదాపు రెండు సంవత్సరాలు ఏడు బిల్లులకు ఆమోదం తెలపకుండా ఎందుకున్నారని సుప్రీంకోర్టు కేరళ గవర్నర్‌నుద్దేశించి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. ఏడు బిల్లులను రాష్ట్రపతి అనుమతి కోసం ఆపి ఉంచడం గురించి అడగ్గా, మంత్రులు వచ్చి ఈ చట్టాల్లోని వివరాలను తెలియజేయడం కోసం తాను రెండు సంవత్సరాలు వేచి చూశానని ఆయన చెప్పారు. అంతేకాకుండా వాటిలో నాలుగు బిల్లులు మనీ బిల్లులని, వాటిని సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. మిగతా మూడు బిల్లులు యుజిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. కాగా సుప్రీంకోర్టు చేసింది కేవలం వ్యాఖ్య మాత్రమేనని కూడా ఆరిఫ్ ఖాన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News