Monday, April 29, 2024

తీర్థయాత్ర ముగిసింది

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌లో చేరిక వేళ కెసిఆర్ కుటుంబంపై రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవా రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీని కుటుంబమే నడిపిస్తుందన్న భావన ప్రజ ల్లో ఉందని పరోక్షంగా కెసిఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేసి నా కేడర్‌ను దూరం చేసుకోకూడదన్నారు. బిఆర్‌ఎస్, కెసిఆర్ ఇచ్చిన గౌరవాన్ని తాను మరిచిపోలేనన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన మాట కు చాలా విలువ ఇచ్చారన్నారు. కొన్ని అంశాలను సరిచేసుకోవాల్సి ఉండగా బిఆర్‌ఎస్ దానిని పట్టించుకోలేదన్నారు. 13 ఏళ్లు తీర్థ యాత్ర ముగిసింది అనుకుంటున్నానని, ఇప్పుడు తన సొంత పార్టీకి వస్తున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే తుది శ్వాస వరకు ఉంటానని ఆయన పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నాకు ఎంతో చేసిందని ఆయన తెలిపారు.

తాను 55 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్నానని, నాలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ నుంచి ఇన్‌ఛార్జీగా పనిచేశానని ఆయన పేర్కొన్నారు. తాను సీడబ్లూసీ మెంబర్‌గా చేసింది కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపిలుగా తెలంగాణ కోసం ఎంతగానో తాము కొట్లాడామని, పబ్లిక్‌లో తెలంగాణ ఉద్యమం ఉన్న సమయంలో బిఆర్‌ఎస్‌లో జాయిన్ అవ్వాలన్న ప్రతిపాదన వచ్చిందని కె.కేశవ రావు తెలిపారు. 55 ఏళ్ల తర్వాత టిఆర్‌ఎస్‌లో జాయిన్ అయ్యానని, పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ కావాలంటే ఎక్కువ ఎంపిలు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఎంపిలు చేసిన పోరాటంతో ఈ బిల్ పాస్ అయిందని, తాను కొన్ని కారణాల వల్ల ఆరోజు బిఆర్‌ఎస్ కు వెళ్లానని ఆయన తెలిపారు.

పార్టీని విడిచి పోవద్దని కెసిఆర్ అన్నారు….
తాను గురువారం కెసిఆర్‌ను కలిశానని, మీరు పార్టీని విడిచి పోవద్దని తనతో కెసిఆర్ అన్నారని కెకె తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు బిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కెసిఆర్ తన ముందే సోనియాగాంధీకి చెప్పారని, కానీ, ఆయన విలీనం చేయలేదన్నారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 64 సార్లు రాజ్యసభ సమావేశాలకు వెళ్లానని, బిఆర్‌ఎస్ నుంచి 16 సార్లు మాత్రమే వెళ్లానని, కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి లోకి వెళ్లాలని కెసిఆర్‌కు తాను చెప్పానని, కానీ కెసిఆర్ మాత్రం తన మాట వినలేదన్నారు. నేడు తన కూతురు విజయ లక్ష్మి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని, తాను ఢిల్లీ నాయకులతో చర్చించి న తర్వాత జాయినింగ్ తేదీని చెబుతానన్నారు.
నాకు పదవి లెక్క కాదు
తాను పార్టీ మారడం పై విప్ ఇస్తే అందుకు సమాధానం చెబుతానని, తనకు కెసిఆర్ రాజ్యసభ మాత్రమే ఇచ్చారని కెకె అన్నారు. మొదటిసారి రాజ్యసభ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వేసిన రెండో ప్రాధాన్యత ఓటు తోనే తాను గెలిచానని ఆయన అన్నారు. నాకు ఇంకా రెండేళ్లు మాత్రమే రాజ్యసభ ఉందని ఆయన తెలిపారు. నాకు పదవి లెక్క కాదన్నారు.
తెలంగాణ కోసం ఆరు వర్కింగ్ కమిటీల ఏర్పాటు
తెలంగాణపై తీర్మాణం చేసినప్పుడు కాకా వెంకటస్వామితో కలిసి పనిచేశానని ఆయన తెలిపారు. తెలంగాణ గురించి కాంగ్రెస్ ముందే ఆలోచించిందని, దీనికి సంబంధించి కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంశాన్ని లేవనెత్తిందన్నారు. మొదట 1998లో 42 మంది ఎమ్మెల్యేలతో సోనియాగాంధీ కి తెలంగాణ కోసం లెటర్ ఇచ్చామన్నారు. బాగారెడ్డి చైర్మన్‌గా సిఎఫ్టీ ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణ కోసం చాలా మంది నాయకులు నిరాహార దీక్షలు చేశారని ఆయన తెలిపారు. అందరికంటే ముందు కృష్ణా రావు రాజీనామా చేశారని కెకె గుర్తు చేశారు. 1998 నుంచి తెలంగాణ పోరాటం మొదలైందని, ఆరు వర్కింగ్ కమిటీలు ఏర్పాటు అయ్యాయన్నారు. వార్ గ్రూపులో తాను సభ్యుడిగా పనిచేశానన్నారు.

ఉదయం సిఎంతో కెకె భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరుతానని అధికారికంగా ప్రకటించిన కెకె శుక్రవారం ఉదయం సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేరికతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా కెకె సిఎం రేవంత్‌తో చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. ఈనెల 22వ తేదీన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ స్వయంగా కేశవరావు నివాసానికి వెళ్లారు. కేశవరావుతో పాటు ఆయన కూతురు, మేయర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీపాదాస్ మున్షీ ఆహ్వానంతో తండ్రి, కూతుళ్లు ఇద్దరూ బిఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News