తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్యం.. సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని. పేదవారి ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత అనివైద్య ఆరోగ్య, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రూ.11.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం..రూ.82 కోట్ల వ్యయంతో 150 పడకల వైద్యశాల.. రూ.77.20 కోట్ల వ్యయంతో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు వరుసల రహదారి అభివృద్ధి పనులకు స్థానిక ఎంఎల్ఎ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మార్పు రావాలంటే విద్య, వైద్యం, నైపుణ్యం ఉండాలని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజీ అవసరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16 నర్సింగ్ కాలేజీలు, 950 సీట్లు ఏర్పాటు చేశామని, మరిన్ని నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళల్లో మార్పుతో మళా సాధికారత రావాలని, తద్వారా వ్యవస్థలో మార్పులు రావాలని హితవు పలికారు. హుస్నాబాద్ 250 పడకల ఆసుపత్రికి 50 సీట్లతో పిజి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాబోయే కొద్ది రోజులలోనే జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసిన ప్రతి పనిని పూర్తి చేస్తున్నామని తెలిపారు. విధ్వంసం చేసిన వ్యవస్థ నుండి ఆర్థిక విధ్వంసం జరిగినా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నామని అన్నారు. పలు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. అభివృద్ధికి అండగా ఉంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదన్నారు.
గత పదేండ్లలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు: రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
గత పదేండ్లలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం.. ఇందిరమ్మ ఇండ్లు.. సన్న వడ్లకు రూ.500 బోనస్.. రుణమాఫీ.. రైతు భరోసా.. రూ.10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు.. ఆర్టిసిలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డు.. పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తోందని వెల్లడించారు.