Tuesday, June 10, 2025

అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఎపి పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని నివాసంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేనిపై ఏపిలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో అరెస్టు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఓ టీవీ ఛానెల్‌లో డిబేట్ లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. కొమ్మినేనిపై దళిత మహిళలను కించపరిచారన్న అభియోగం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ తదితర సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో మరో జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి టీవీ చానల్ యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం అక్రమం : కొమ్మినేని

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తనను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని ఆయన వాపోయారు. నమోదు చేసిన కేసు ఎఫ్‌ఆర్ కాపీని చూపించిన ఆయన్ను వాహనంలో పోలీసులు విజయవాడకు తరలించారు. కాగా టీవీ చానల్ డిబేట్ లో విశ్లేషకులు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల్ని సాక్షి యాజమాన్యం ఇప్పటికే ఖండించినట్లు కొమ్మినేని పేర్కొన్నారు.

కొమ్మినేని అరెస్ట్‌పై జగన్ ఆగ్రహం

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను ఏపి మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ‘ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున మరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తు న్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లార’ని ఆయన తన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసారు.

అరెస్ట్ దురదృష్టకరం : దేవులపల్లి అమర్

కొమ్మినేని శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం దురదృష్టకరమని, అక్రమ కేసులతో వేధించడం మంచి పద్ధతి కాదని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో ఖండించారు. మీడియాను ఏపిలో కూటమి నేతలు రాజకీయమయం చేస్తున్నారని మండిపడ్డారు. టీవీ ఛానల్‌లో విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించిందని గుర్తు చేసారు. అయినప్పటికీ కొమ్మినేనిపై అక్రమ కేసు పెట్టి వేధించడం సరికాదని అమర్ హితవు పలికారు. మీడియాను కూటమి ప్రభుత్వం శత్రువుగా చూస్తోందన్నారు. కొమ్మినేని టెర్రరిస్ట్ కాదు, పారిపోయే వ్యక్తి అంతకన్నా కాదని పేర్కొన్నారు. అలా అయితే విశ్లేషకుల అందరిపైనా కొమ్మినేనిపై పెట్టి నట్లే అక్రమ కేసులు పెడుతారా? ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయం అంటే ఎలా? అని దేవులపల్లి అమర్ ప్రశ్నించారు.

కుట్రపూరిత కేసు: సజ్జల

తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్రపూరితంగా కొమ్మినేనిని కేసులో ఇరికించారనివైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘ టనను అడ్డం పెట్టుకుని, మూడు రోజులుగా రాద్ధాంతం చేసి, దానికి పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయించారని సజ్జల ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News