Saturday, April 27, 2024

దమ్ముంటే రాజీనామా చేసి..మల్కాజిగిరిలో నాపై గెలువు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉంటే తన పదవికి రాజీనామా చేసి, మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ అధ్యక్షతన జరిగింది. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనపై చేసిన పలు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తనను తండ్రిచాటు కొడుకుగా అభివర్ణించిన సిఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజనర్సింహ వీరంతా ఎలా వచ్చారో చెప్పాలన్నారు. ‘నేను రాంగ్‌రూట్‌లో రాలే.. మా అయ్య కెసిఆర్ ఉద్యమ సమయంలోనే నేను ఉద్యమంలోకి వచ్చా’ అని గుర్తు చేశారు. ‘నీలాగా వాళ్ల, వీళ్ల బూట్లు నాకి, సంచులు మోసి రాలేదు.. ఒకసారి కాదు ..ఐదుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచాను. నీలాగా రాంగ్ రూట్లో రాలేదు. చవుట పనులు చేసి, పార్టీలు మారి, దిక్కుమాలిన పనులు చేసి రాలేదు. చేతగాని వాడినైతే మళ్లీ నేను సిరిసిల్ల్లో గెలుస్తానా..? ఐదుసార్లు గెలిపించారు. కారు కూతలు, రోత మాటలు వద్దు.. ముఖ్యమంత్రిలాగా మాట్లాడు’ అని రేవంత్ రెడ్డికి కెటిఆర్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే కావడం ఖాయమన్నారు. బడే భాయి ఛోటే భాయిను కలిసి కాంగ్రెస్‌ను ఖతం చేయడం ఖాయమన్నారు. ప్రజలు మోసం చేసేవారినే నమ్ముతారని, అలాంటివారినే గెలిపిస్తారని,

నిజాయితీ గల మోసగాడిగా సిఎం రేవంత్‌రెడ్డి చరిత్రకెక్కారని ఎద్దేవా చేశారు. శాసనసభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మాయమాటలు, రంగుల సినిమాతో ప్రజను మోసం చేశారని, కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నారని మబ్బుల వెనుకకు వెళితేనే సూర్యుని విలువ తెలుస్తుందని అన్నారు. అలాగే మనపనితనాన్ని తొందరలోనే ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయినా మాత్రాన ఎవరూ అధైర్యపడొద్దని, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సూత్రంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి నుండి జైత్రయాత్ర కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారలతో తప్పుదోవ పట్టించారని, ప్రజలను మోసం చేశారని, కొన్ని పొరపాట్లతో తాము ఓడిపోయామని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో మూడు వేల ఓట్లు, జుక్కల్‌లో 1140 ఓట్లు, కామారెడ్డిలో ఆరు వేల స్వల్ప మెజారిటీతో ఓడి పోయామని, రాష్ట్రంలోని చాలా స్థానాలలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని గుర్తు చేశారు. ప్రజలు మార్పు కోరుకోవాలని ప్రచారం చేశారని, కానీ మార్పు అంటే పంటలు ఎండిపోవడమా, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమా అని ప్రశ్నించారు.

డిసెంబర్ 9న రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానని మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పటికీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి.. నేడు లక్ష రూపాయలే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల విషయమై ప్రతిపక్షంలో ఉన్న తాము నిలదీస్తే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజలకోసం పోరాటం చేస్తామని అన్నారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని మార్చి 17 వరకు ఓపిక పడుదామని, గ్యారెంటీలు అమలు కాకపోతే నిలదీద్దామని కార్యకర్తలకు సూచించారు.ప్రభుత్వానికి వంద రోజులు నిండిన వెంటనే ఆడబిడ్డలు కాంగ్రెస్‌కు బొంద తవ్వుతారని అన్నారు. ఇంట్లో ఉన్న ఆడపడుచులకు చేయూత పథకం కింద 10,500 ఇస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు రైతులు పండించిన వరి పంటకు క్వింటాలుకు రూ,500 బోనస్ ప్రకటించాలని, ఎండిపోయిన పంటకు పదివేల నష్టపరిహారం చెలించాలని, రెండు లక్షల రుణమాఫీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాలంతెచ్చిన కరువు రాలేదని కాంగెస్ తెచ్చిన కరువు వచ్చిందని ఎద్దేవా చేశారు. సాధారణ వర్షపాతం కంటే 14% నమోదైందని, కేవలం కెసిఆర్‌పైన, రైతులపైన కోపంతోనే పంటలు ఎండిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని, రోజూ రెండు టిఎంసిల నీటిని మేడిగడ్డ, సుందిళ్ల, మిడ్‌మానేర్ ద్వారా నిజాంసాగర్, మంచిప్ప ద్వారా కామారెడ్డి ప్రాంతానికి సాగునీరు అందించే బృహత్తర ప్రణాళికను చేపట్టామని అన్నారు. 1600 మీటర్లలో 85 పిల్లర్లతో ప్రాజెక్టును నిర్మిస్తే అందులో రెండు, మూడు పిల్లర్లు కుంగిపోతే మూడు నెలల్లో రిపేరు చేయవచ్చని, దానిని రిపేరు చేయకుండా తమను విమర్శించడానికే కాంగ్రెస్ మంత్రులు, నాయకులు పరిమితమయ్యారని అన్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సిఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎక్కువ రోజులు సాగదని జోస్యం చెప్పారు. తమ నేత కెటిఆర్ విసిరిన సవాల్‌కు సిఎం పది రోజులైనా పత్తాలేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, మాజీ ఎంఎల్‌ఎ జాజాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News