Friday, April 26, 2024

మడమతిప్పం.. ఎదుర్కొంటాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీపై, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి, కెటిఆర్ ఫైర్ అయ్యారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదనీ, అవి మోడీ సమన్లని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కెటిఆర్ పలువురు మంత్రులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 8 ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో జుమ్లా లేకపోత ఆమ్లా అనే విధానాన్ని మోడీ ప్రభుత్వం వ్యవహారిస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.

మంత్రి గంగుల మీద ఈడీ, సీబిఐ దాడులు చేయించారని, మల్లారెడ్డి మీద ఐటీ దాడులు చేయించారని, తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏ ఇంటి మీద ఈడీ దాడులు, జగదీశ్ రెడ్డి పీఏ ఇంటి మీద ఐటీ దాడులు, నామా నాగేశ్వర్ రావు మీద ఈడీ, వద్దిరాజు రవిచంద్రపై సీబిఐ దాడులు, పార్థసారథి రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులు, ఎమ్మెల్సీ రమణపై ఈడీ విచారణ జరిపారని, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారణ పేరుతో మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ ఐటీలను ఉసిగొల్పుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ నాయకత్వంలో దేశంలో బిఆర్‌ఎస్ పురోగమిస్తున్న విధానం, తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు పంపించదని ఇది రాజకీయంగా చేసే చిల్లర ప్రయత్నమని కెటిఆర్ ఆరోపించారు. సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలాగా మారాయాని కెటిఆర్ ధ్వజమెత్తారు.
నీతి లేని పాలనకు పర్యాయపదం ఎన్డీఏ….
నీతిలేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈ రోజు పర్యాయపదంగా ఎన్డీఏ ప్రభుత్వం మారిందని కెటిఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలపై కేసులు… ప్రజలపై ధరల దాడి ఇవి తప్ప వారు సాధించింది ఏమీ లేదని, కేంద్రాన్ని, ప్రధాని మోడీని ఒక్కటే అడుగుతున్నానని కెటిఆర్ పేర్కొన్నారు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ, ఆయన మోడీ బినామీ అని చిన్న పిల్లగాడు కూడా చెప్తాడనీ, అదానీపై హిండెన్ బర్గ్ సంస్థ రిపోర్టు ఇచ్చినా కేంద్రం మాట్లాడలేదని, ఎల్‌ఐసి, ఎస్‌బిఐకు చెందిన రూ. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా ఈ దేశ ప్రధాని ఉలకడు, పలకడని ఆయన ఆరోపించారు. దీనిపై ఆర్థిక మంత్రి కూడా స్పందించరని, బినామీని కాపాడుకునే బాధ్యత వారిపై ఉన్నా స్పందించడం లేదని కెటిఆర్ నిప్పులు చెరిగారు.
అదానీ మీద ఏ కేసు ఉండదు..
ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి అదానీకి ఆరు ఎయిర్‌పోర్టులు ఇచ్చి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. అవినీతికి పాల్పడే అదానీ మీద ఏ కేసు ఉండదనీ, అదానీకి చెందిన ముంద్రా పోర్టు రూ.21 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ దొరికితే కేసు కాలేదనీ, అదానీని విచారించే దమ్ము దర్యాప్తు సంస్థలకు ఉందా..? అని కెటిఆర్ నిలదీశారు.
సుజనా చౌదరిపై రూ.6 వేల కోట్ల కేసు ఏమైంది ?
బిజెపిలో చేరగానే కేసులన్నీ ఏమైపోతున్నాయని కెటిఆర్ ప్రశ్నించారు. సుజనా చౌదరి, సిఎం రమేశ్ బిజెపిలో చేరగానే కేసులన్నీ మాయమైపోయాయని ఆయన ఆరోపించారు. సుజనా చౌదరిపై రూ.6 వేల కోట్ల కేసు ఏమైందని, ఈ దేశంలో ఏం జరుగుతుందని, అదానీపై శ్రీలంక ఆరోపణలపై మోడీ సమాధానం చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. బిబిసి మీద దాడి చేసిన వ్యక్తి మీరేంత అని ఇండియా మీడియాపై మోడీ అహంకారం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. జీ టూ జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదనీ, గౌతం అదానీ టూ గొటబాయ డీల్ అని శ్రీలంక ప్రతినిధి అన్నారని కెటిఆర్ తెలిపారు.
ప్రతిపక్షాలపై 5,422 కేసులు
2014 తర్వాత ప్రతిపక్షాలపై 5,422 ఈడీ కేసులు నమోదు అయ్యాయని కెటిఆర్ తెలిపారు. 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చిందని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే మోడీ ప్రధాన ఉద్ధేశమన్నారు. కాంగ్రెస్ మీద 24, టిఎంసి మీద 19, ఎన్సీపీ మీద 11, శివసేన ఉద్ధవ్ థాక్రే మీద 8 కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. డీఎంకే 6, బిజేడి మీద 6 ఈడీ కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడని, అతనిపై ఎలాంటి కేసులు నమోదు కాదనీ, తాను బిజెపి ఎంపీనని తనపై ఈడీ దాడులు జరగవని ఒకాయన డైరెక్ట్‌గా చెప్పారని కెటిఆర్ తెలిపారు.
9 ఏళ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేత
9 ఏళ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట వాస్తవం కాదా..? పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా..? డబుల్ ఇంజన్ అంటే దేశానికి అర్థమైంది. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదానీ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. అడ్డమైన దొంగ సొమ్ముతో ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చి, లొంగని వారిపై ఈడీ, సీబిఐ దాడులు చేయించాలని అదేపనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. మునుగోడులో ఒక వ్యక్తికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్తవం కాదా..? దీనిపై ఇప్పటి వరకు జవాబు చెప్పే దమ్ము బిజెపి నాయకుడికి ఉందా..? విదేశాల్లో బొగ్గును ఎందుకు కొనాలని సిఎం కెసిఆర్ కేంద్రాన్ని అడిగితే ఇంత వరకు స్పందన లేదన్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయని మోడీ,- అదానీ స్నేహం గురించి అందరికీ తెలుసునని కెటిఆర్ తెలిపారు.
మీడియాను మాఫియాను నడిపించినట్టే…
ఒక మాఫియాను నడిపించినట్టే మీడియాను నడిపిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. బిజెపి మౌత్ పీసెస్‌లాగా ఉన్న చిల్లర సంస్థలు రాష్ట్రంలో ఏవైతో ఉన్నాయో వాటిని ప్రజల ముందు ఎండగడుతామని కెటిఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలంటే తమకు కూడా గౌరవం ఉందని కెటిఆర్ తెలిపారు. కానీ మీడియా యాజమాన్యాల గొంతు నులిమి పట్టుకుని ఈడీ, సీబిఐ కేసులు పెడుతు న్నారని, వారు మాత్రం ఏం చేయగలరని ఆయన ఆరోపించారు. మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రభ పత్రికపై కూడా కేసులు పెట్టారని, ఎవర్నీ వదిలిపెట్టడం లేదనీ, మీకు ధైర్యం లేకపోవచ్చు, మాకుంది, వాస్తవాలు చూపించే సత్తా మీకు లేకపోవచ్చు, మాకుంది, తప్పకుండా వాస్తవాలు చూపెడుతాం, వంద శాతం వీరిని నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టే బాధ్యత మాది అని కెటిఆర్ స్పష్టం చేశారు.
మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో మాకు తెలుసు ?
మద్య నిషేధం ఉన్న గుజరాత్‌లో లిక్కర్ తాగి 42 మంది చనిపోయారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అది స్కామా.. స్కీమా.. ఏమంటావు.. అది మోడీ స్కీమా..? అది మీ వి6లో చూపించావా..? వి6లో ఏం మాట్లాడుతారో తెలుసు.. ఏం చూపెడుతారో తెలుసు.. ఏం డ్రామాలో చేస్తారో తెలుసు.. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసనీ కెటిఆర్ పేర్కొన్నారు. తాను వంద శాతం చెబుతున్నానని బిజెపి మౌత్ పీస్‌లాగా ఉన్న చిల్లర సంస్థలు రాష్ట్రంలో ఏవైతో ఉన్నాయో వాటిని ప్రజల ముందు ఎండగడుతామన్నారు. అది వెలుగు పేపరా.. వి6.. ఇంకోటా కాదనీ ఆయన పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలను బిజెపి ఆఫీసులో బ్యాన్ చేశారని, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదనీ, అది అప్రజాస్వామికం కాదా..? ఈ పత్రికలు ఈ దేశంలో ఎవరు ఆడించినట్టు ఆడుతున్నాయని కెటిఆర్ ప్రశ్నించారు.
బిబిసి మీద దాడి చేసినోడికి మీరెంత ?
మోడీ మీద శ్రీలంక ఆరోపణ చేస్తే ఒక్క పత్రికనైనా రాసిందా..? ఒక్క మీడియా సంస్థనైనా..? ఎందుకు ధైర్యం చేయలేకపోయిందని కెటిఆర్ ప్రశ్నించారు. ఎందుకో తెలుసు.. మీ బాధను మేం అర్థం చేసుకోగలుగుతాం. బిబిసీ మీదనే దాడి చేసినోడు.. మిమ్మల్ని వదిలిపెడుతాడా.. మీరెంత ఆయనకు. చాలా మందిని ఆయన కొనేశాడు. ఎన్డీటివిని ఎవరు కొన్నారు… గౌతమ్ అదానీ, మిగతా సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News